: వచ్చిన చెడ్డ పేరు పోగొట్టుకోవడానికి నానా తంటాలూ పడుతున్న ఎయిర్ ఇండియా!

ప్రపంచంలోనే అత్యంత చెత్త ఎయిర్ లైన్స్ సంస్థల్లో మూడవ స్థానంలో నిలిచిన ఎయిర్ ఇండియా తనకు వచ్చిన చెడ్డపేరును పోగొట్టుకునేందుకు నానా తంటాలూ పడుతోంది. నోబెల్ బహుమతి విజేత అమర్త్యసేన్ ఢిల్లీ నుంచి లండన్ కు ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించిన వేళ, ఆయన వెల్లడించిన అభిప్రాయాన్ని ఎయిర్ ఇండియా ట్వీట్ రూపంలో వెల్లడించింది. ఈ నెల 9న ఆయన విమానంలో ప్రయాణించి, "అద్భుతమైన సేవలను అందించినందుకు చాలా కృతజ్ఞతలు. నాకెంతో సంతోషంగా ఉంది. బెస్ట్ విషెస్" అంటూ తెలిపిన ఆయన అభిప్రాయాన్ని ట్వీట్ ద్వారా పంచుకుంది.

"నోబెల్ విజేత అమర్త్య సేన్ ఏఐ111లో ప్రయాణిస్తూ, సంస్థను మెచ్చుకున్నారు. ఇది ఏఐకి గర్వకారణం. తిరిగి ఆయన మరోసారి విమానం ఎక్కుతారని ఆశిస్తున్నాం" అని పేర్కొంది. కాగా, అమర్త్య సేన్ ప్రయాణించిన ఈ విమానం సైతం ఆలస్యంగానే బయలు దేరినట్టు తెలుస్తోంది. అర్ధరాత్రి 2:45కు టేకాఫ్ కావాల్సిన విమానం గంట ఆలస్యంగా బయలుదేరగా, గమ్యస్థానమైన లండన్ కు 40 నిమిషాల ఆలస్యంగా చేరుకుంది. అమర్త్య సేన్ పేర్కొన్న అభిప్రాయాన్ని చెప్పిన ఏఐ, ఆలస్యం గురించి ప్రస్తావించకపోవడం గమనార్హం. కాగా, ఇటువంటి ఆలస్యాల కారణంగానే సంస్థ ర్యాంకు పడిపోయిందని ప్రయాణికులు అంటున్నారు.

More Telugu News