chandrababu: నాకు రెండుసార్లు ప్రధాని అయ్యే అవకాశం వచ్చింది.. వదులుకున్నా: చంద్రబాబు

చెన్నయ్‌ గిండిలోని ఐటీసీ హోటల్ లో ఈ రోజు నిర్వ‌హించిన‌ 'ఇండియా టుడే' సదస్సుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు హాజరయిన విష‌యం తెలిసిందే. ఈ సందర్భంగా ఇండియాటుడే సంపాదకుడు రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ అడిగిన పలు ప్రశ్నలకు చంద్రబాబు జ‌వాబులిచ్చారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ న‌వ్య‌రాజ‌ధాని ఆమరావతిని ప్రపంచంలోని ఉత్తమ నగరాలలో ఒకటిగా నిర్మించాలన్నదే త‌న ల‌క్ష్య‌మ‌ని వివ‌రించారు. భవిష్యత్తులో కేంద్ర స‌ర్కారులో ఆయ‌న‌ ఎలాంటి పాత్ర పోషిస్తార‌నే ప్ర‌శ్న‌కు స‌మాధానం చెబుతూ... గ‌తంలో యునైటెడ్‌ ఫ్రంట్‌ హయాంలో త‌న‌కు రెండు సార్లు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చిందని, కానీ తాను ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాజకీయాలకే  ప్రాధాన్యత ఇచ్చి ఆ అవకాశాల‌ను వ‌దులుకున్న‌ట్లు పేర్కొన్నారు. ఈ అంశంలో తనలో ఇప్ప‌టికీ మార్పు లేదని తేల్చిచెప్పారు.

కాంగ్రెస్ స‌ర్కారు ఏపీని స‌హేతుకంగా విభజించకపోవడంతో ఎన్నో ఇబ్బందులు త‌లెత్తాయ‌ని చంద్రబాబు అన్నారు. అమ‌రావ‌తి కోసం ఏపీలోని రైతులు వేలాది ఎకరాలు ఇచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని పేర్కొన్నారు. త‌మ పార్టీపై ప్ర‌తిప‌క్ష వైసీపీ నేత‌లు చేస్తోన్న ఆరోప‌ణ‌ల‌ను తిప్పికొడుతూ.. అవినీతి కేసులో జైలు జీవితం గడిపిన వారు చేసే ఇటువంటి మాట‌ల‌ను పట్టించుకోనవసరం లేదని స్ప‌ష్టం చేశారు.

More Telugu News