: 31 లక్షల ఎకరాల భూమిని వైయస్ పంపిణీ చేస్తే... చంద్రబాబు మాత్రం లాక్కుంటున్నారు: జగన్

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి 23 లక్షల మంది పేదలకు 31 లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేస్తే... చంద్రబాబు మాత్రం దళితుల భూములను లాక్కుంటున్నారని వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. ఈ భూములేమైనా ఆయన అత్తగారి సొత్తా? అని ప్రశ్నించారు. కర్నూలు జిల్లా మహానంది మండలం గాజులపల్లిలో రైతు భరోసా యాత్రలో భాగంగా ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కర్నూలు జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం 40 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని... కానీ, కేవలం నలుగురికే ఎక్స్ గ్రేషియా ఇచ్చారని అన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇక్కడ కరువే కరువని అన్నారు.

వైయస్ హయాంలో ప్రతి రబీ పంటకు శ్రీశైలం నుంచి సాగు నీరు అందిందని... ఇప్పుడు పూర్తి స్థాయి నీటిమట్టం ఉన్నా రాయలసీమకు నీళ్లు ఇవ్వడం లేదని జగన్ మండిపడ్డారు. రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ, ఇన్స్యూరెన్స్ కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. కేబినెట్ సమావేశాల్లో రైతుల సమస్యలపై చర్చించకుండా... భూములను ఎలా లాక్కోవాలనే అంశంపై మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

More Telugu News