: ధోనీకి గౌరవం... మ్యాచ్ కు ఫ్రీ ఎంట్రీ!

టీమిండియా లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్ కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోనీ వైదొలగిన సంగతి తెలిసిందే. అయితే, ధోనీ గౌరవార్థం ఓ మ్యాచ్ లో కెప్టెన్సీ చేసే అవకాశాన్ని అతనికి బీసీసీఐ కల్పించింది. ఈ నేపథ్యంలో, ముంబైలోని బ్రాబోర్న్ స్టేడియంలో ఈ మధ్యాహ్నం 1. 30 గంటల నుంచి ఇంగ్లండ్, భారత్-ఏ జట్ల మధ్య జరిగే మ్యాచ్ కు చివరిసారిగా ధోనీ ప్రాతినిధ్యం వహించనున్నాడు.

ఈ మ్యాచ్ కు హాజరయ్యే క్రికెట్ అభిమానులకు బీసీసీఐ గుడ్ న్యూస్ తెలిపింది. మ్యాచ్ ను వీక్షించడానికి వచ్చే అభిమానులకు ఫ్రీ ఎంట్రీ కల్పించనున్నట్టు ప్రకటించింది. 10 వేల మందికి ఉచిత పాస్ లు ఇస్తున్నట్టు చెప్పింది. మ్యాచ్ ప్రారంభమైన తర్వాత కూడా అభిమానులను ఫ్రీగా స్టేడియంలోకి అనుమతించనున్నట్టు తెలిపింది. ఫ్రీగా ఆటను చూసేవారికి కేటాయించిన నార్త్, ఈస్ట్ స్టాండ్లు నిండిపోతే గేట్లను మూసివేస్తామని ఓ అధికారి తెలిపారు. 

More Telugu News