: గూగుల్ ప్లే స్టోర్ లో దుమ్ము రేపుతున్న ‘భీమ్’ యాప్.. ప‌ది రోజుల్లో ఏకంగా కోటి దాటిన డౌన్‌లోడ్స్‌

దేశంలో న‌గదుర‌హిత లావాదేవీల‌ను ప్రోత్స‌హించే క్ర‌మంలో ప‌్ర‌ధాని న‌రేంద్ర మోదీ గ‌త‌నెల 30న‌ ప్రారంభించిన ఈ-వాలెట్ భార‌త్ ఇంట‌ర్‌ఫేస్ ఫ‌ర్ మ‌నీ (భీమ్‌) ని స్మార్ట్‌ఫోన్ యూజ‌ర్లు పెద్ద ఎత్తున డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. కేవ‌లం ప‌ది రోజుల్లోనే ఈ యాప్‌ను కోటి మంది యూజ‌ర్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. భీమ్‌కు వ‌స్తోన్న ఆద‌ర‌ణ ప‌ట్ల ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. దేశంలో అవినీతి, న‌ల్ల‌ధ‌నాన్ని నిర్మూలించ‌డానికి సాంకేతిక‌త ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని అన్నారు.

భీమ్ యాప్‌ను విడుద‌ల చేసిన మూడు రోజుల్లోనే 4.1 రేటింగ్‌తో భార‌త్‌లోనే మోస్ట్ పాప్యుల‌ర్ ఆండ్రాయిడ్ అప్లికేష‌న్‌గా నిలిచిన విష‌యం తెలిసిందే. స్మార్ట్‌ఫోన్‌ల‌లో ఇంట‌ర్నెట్ సౌక‌ర్యం లేక‌పోయినప్ప‌టికీ, అప్‌గ్రేడెడ్ అన్‌స్ట్ర‌క్చ‌ర్డ్ స‌ప్లిమెంట‌రీ స‌ర్వీస్ డేటా (యూఎస్ఎస్‌డీ) ద్వారా ఫీచ‌ర్ ఫోన్ల‌లోనూ ఈ యాప్ పని చేస్తుంది. త్వ‌ర‌లోనే ఆధార్ ఆధారిత చెల్లింపుల స‌దుపాయాన్ని భీమ్‌లో తీసుకురానున్నారు. ఎన్నో ఈ-వాలెట్ యాప్‌ల‌లో లేని స‌దుపాయాలు భీమ్‌లో ఉన్నాయి. ఈ యాప్ ద్వారా యూజ‌ర్లు త‌మ బ్యాంకు అకౌంట్ బ్యాలెన్సు వివ‌రాల‌ను కూడా తెలుసుకోవ‌చ్చు. యూనిఫైడ్ పేమెంట్ ఇంట‌ర్‌ఫేస్ లేని ఖాతాల‌కు సైతం ఐఎఫ్ఎస్‌సీ, ఎంఎంఐడీ కోడ్స్ ద్వారా న‌గ‌దు లావాదేవీలు జ‌రుపుకునే అవ‌కాశం ఉంది.

More Telugu News