: చైనాకు బ్రేక్ వేసేందుకు భారత్ పైఎత్తు... వియత్నాంకు ఆకాష్ మిసైల్స్ సరఫరా!

దక్షిణాసియాలో తన పట్టును మరింతగా పెంచుకునే చైనా వ్యూహాలు రచిస్తున్న వేళ, ఆ దేశానికి చెక్ చెప్పేందుకు భారత్ కదిలింది. చైనాతో దీర్ఘకాలంగా విభేదిస్తున్న వియత్నాంకు భూ ఉపరితలం నుంచి ఆకాశంలోని లక్ష్యాలను సునాయాసంగా ఛేదించగల ఆకాష్ క్షిపణి వ్యవస్థలను అందించాలని నిర్ణయించింది. ఆసియా పసిఫిక్ రీజియన్ లో దూకుడుగా ఉన్న చైనాను నిలువరించాలంటే, వియత్నాంకు సాయపడాలన్నది కేంద్రం ఆలోచనగా తెలుస్తోంది. ఇదే సమయంలో 48 దేశాల న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ లో భారత్ చేరికను అడ్డుకొంటూ, జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ ను ఉగ్రవాదిగా ప్రకటించకుండా పుల్లలు పెడుతున్న చైనా ఎత్తులకు వియత్నాంతో కుదుర్చుకున్న 'వ్యూహాత్మక సైనిక ఒప్పందం' పైఎత్తు వంటిదని రక్షణ రంగ నిపుణులు వ్యాఖ్యానించారు.

25 కిలోమీటర్ల దూరంలోని హెలికాప్టర్లు, విమానాలు, డ్రోన్లను కూల్చగల ఆకాష్ క్షిపణులను వియత్నాంకు అందించే దిశగా చర్చలు తుది దశకు వచ్చాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కాగా, గతంలో బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్స్, యాంటీ సబ్ మెరైన్ టోర్పడోలు 'వారుణాస్త్ర' లను కూడా వియత్నాంకు భారత్ ఆఫర్ చేసిన సంగతి తెలిసిందే. వియత్నాం కొనుగోలు చేసిన సుఖోయ్ 30 ఎంకేఐ ఫైటర్ జెట్ విమానాల్లో పైలట్లకు శిక్షణ ఇచ్చేందుకు సైతం ఇండియా అంగీకరించింది. తమకు వియత్నాం దగ్గరి స్నేహితుడని, ఆ దేశంతో ద్వైపాక్షిక, రక్షణ సహకారాన్ని మరింతగా పెంచుకోవాలన్నది తమ అభిమతమని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ వ్యాఖ్యానించారు.

More Telugu News