: ఆమె ప్రవర్తన సరిగా లేదు!: ధనలక్షిని కత్తితో పొడవడానికి కారణం చెప్పిన చంద్రశేఖర్

కాకినాడలోని ఎల్విన్ పేటలో ధనలక్ష్మి అనే మహిళపై చంద్రశేఖర్ అనే యువకుడు కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 17 సార్లు ఆమెను అత్యంత దారుణంగా పొడిచాడు. ఈ నేపథ్యంలో, ఆసుపత్రిలో ఆమె అత్యంత విషమ పరిస్థితిలో ఉంది. ఈ క్రమంలో చంద్రశేఖర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని చేతికి కూడా కత్తి గాట్లు పడటంతో... చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకొచ్చారు. పోలీసుల విచారణలో జరిగిన విషయాన్ని మొత్తం చంద్రశేఖర్ చెప్పాడు.

చంద్రశేఖర్ చెప్పిన వివరాల ప్రకారం... మూడేళ్ల క్రితం ధనలక్ష్మి భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత ధనలక్ష్మి, అతను సహజీవనం చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో, ధనలక్ష్మి మళ్లీ పక్కదారి పట్టిందని, వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని... అందుకే ఆమెను అంతం చేయాలనుకున్నానని చంద్రశేఖర్ తెలిపాడు. తనకు నమ్మక ద్రోహం చేయడాన్ని భరించలేకపోయానని చెప్పాడు. ఆమె వ్యవహారం సరిగా లేకపోవడం వల్లే... ఆమె భర్త ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించాడు. 

More Telugu News