: 'ఖైదీ నం 150' విడుదల రోజు పండగ చేసుకోండి.. ఆఫీసుకు సెలవు ప్రకటించిన అరబ్ సంస్థ!

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ చిత్రం 'ఖైదీ నం 150'పై విదేశాల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని చూసేందుకు తమ సంస్థ ఉద్యోగులు అత్యధికులు జనవరి 11న సెలవు పెడతారని భావించిన ఓ అరబ్ సంస్థ ఏకంగా సెలవు ప్రకటించింది. మస్కట్ లోని 'అల్ రియాద్ కన్ స్ట్రక్షన్ అండ్ ట్రేడింగ్ ఎల్ఎల్సీ' అనే సంస్థ 'బాస్ ఈజ్ బ్యాక్' అంటూ ఉద్యోగులకు సెలవు ఇచ్చింది. ఒమన్ లోని అల్-వాడీ ఎల్ కబీర్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ నిర్మాణ రంగంలో సేవలందిస్తోంది.

సినీ ప్రియులకు మరో పండగొచ్చిందని చెబుతూ, మూవీ మొఘల్, కింగ్ ఆఫ్ కింగ్స్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చిరంజీవి 150వ చిత్రాన్ని తమ ఉద్యోగులు సెలబ్రేట్ చేసుకుంటారని పేర్కొంది. సినీ దిగ్గజం చిరంజీవిని దేవుడిలా కొలిచే ఉద్యోగుల కోసం సెలవు ప్రకటిస్తున్నట్టు వెల్లడించింది. కాగా, గత ఏడాది 'కబాలీ' సినిమా రిలీజ్ రోజున పలు అరబ్ కంపెనీలు సెలవును ప్రకటించిన సంగతి తెలిసిందే.

More Telugu News