: ఇక పాదాభివందనాలు వద్దే వద్దు... ఆ సంస్కృతి పోవాలి: డీఎంకే నేతలకు స్టాలిన్ వేడుకోలు

ఒంగి దండాలు పెట్టడం, కాళ్లపై పడిపోయి పాదపూజలు చేయడం వంటి సంస్కృతి పోవాలని, ఒక్క నమస్కారం పెడితే చాలని డీఎంకే నేతలను ఆ పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ వేడుకున్నారు. అధినేతల దృష్టిలో పడేందుకు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ, ఒంగి దండాలు పెట్టడం, మరికొందరు ఇంకో అడుగు ముందుకేసి ఏకంగా సాష్టాంగ నమస్కారాలు చేయడం తమిళనాట రాజకీయాల్లో నిత్యమూ చూసేదే. తాజాగా, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన తరువాత, తన వద్దకు వస్తున్న నేతలు సైతం ఇదే విధంగా, తమను ఆశీర్వదించాలని కోరుతూ కాళ్లపై పడుతుంటే, ఆయన ఇబ్బందిగా భావిస్తూ, ఈ సంస్కృతికి చరమగీతం పాడాలంటూ, కేడర్ కు ఓ లేఖ రాశారు.

తనపై అతి పెద్ద బాధ్యతలు ఉన్నాయని చెబుతూ, నాయకులు ప్రేమానురాగాలతో అభినందనలు తెలియజేయడానికి వస్తున్న వేళ, పలువురు వ్యవహరిస్తున్న తీరు తన మనసును ద్రవింపచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కన్న తల్లిదండ్రులకు తప్ప మరొకరి కాళ్లపై పడి ఆశీర్వాదాలు పొందాల్సిన అవసరం నేతలకు లేదని, ఎదుటి మనిషికి గౌరవం ఇవ్వాలని భావిస్తే, నమస్కారం చేస్తే చాలని, పాదపూజలు, సాష్టాంగ నమస్కారాలు వద్దని వేడుకున్నారు.

More Telugu News