: ఢిల్లీ వెళ్లాడు.. డ్యాన్సు లు మర్చిపోయాడు, హస్తినాపురం వెళ్లాడు.. హాస్యం మర్చిపోయాడు.. అనుకున్నారా?: అంటూ హుషారెత్తించిన చిరంజీవి

'రాననుకున్నారా? రాలేననుకున్నారా?' అంటూ చిరంజీవి డైలాగ్ చెబుతూ హాయ్ లాండ్ లో అభిమానులను ఉర్రూతలూగించారు. 'ఢిల్లీ వెళ్లాడు, డ్యాన్సు లు మర్చిపోయాడు, హస్తినాపురం వెళ్లాడు హాస్యం మర్చిపోయాడు, మన మధ్య లేడు మాసిజం మర్చిపోయాడు అనుకున్నారా?' అంటూ అడిగారు. మళ్లీ ఆదే గ్రేసు, హుషారుతో మళ్లీ అభిమానుల ముందుకు వస్తున్నానని అన్నారు. తన స్నేహితుడు రజనీకాంత్ తనతో మాట్లాడుతూ, 'మనల్ని మన అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలా మన అభిమాని మాత్రమే దర్శకత్వం చేయగలడని అనేవాడని, ఆయన అన్నట్టు తనను వినాయక్ అలాగే చూపించాడని చిరంజీవి కితాబునిచ్చారు.

తన బాడీలాంగ్వేజ్ కు సరిపోయే సంగీతాన్ని దేవీశ్రీప్రసాద్ ఇచ్చాడని ఆయన చెప్పారు. హుషారైన పాటలతోనే కాకుండా అద్భుతమైన రైతు పాటను కూడా అందించాడని ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఫైట్ మాస్టర్స్, ఛాయాగ్రాహకుడు, డాన్స్ మాస్టర్స్ అంతా తనను బాగా చూపించే ప్రయత్నం చేశారని చిరంజీవి తెలిపారు. రామ్ చరణ్ కు నటనలో హద్దులతోపాటు నిర్మాణంలో పద్దులు కూడా తెలుసని చిరంజీవి చెప్పారు. బ్యాంకాక్ షూటింగ్ లో ఉన్న రామ్ చరణ్, క్రొయేషియాలో ఉన్న తమ యూనిట్ లోని ప్రతి ఒక్కరి చేతిలో 300 యూరోలు ఉండాలని చెప్పాడంటే ఎంతో మంచి నిర్మాత అనిపించుకున్నాడని చిరంజీవి ప్రశంసించారు. పరుచూరి సోదరులతో తన అనుబంధం 'ఖైదీ'తో బలోపేతమైందని, ఇప్పటివరకు బలంగా సాగిందని ఆయన తెలిపారు. 

More Telugu News