: అఖిలేష్ నిక్కర్లు వేసుకున్నప్పటి నుంచి అన్నిట్లో తోడున్నా... ఇప్పుడు అతని మాటలు వింటుంటే గుండె తరుక్కుపోతోంది: అమర్ సింగ్

సమాజ్ వాదీ పార్టీలో జరుగుతున్న పరిణామాల పట్ల ఆ పార్టీ కీలక నేత అమర్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. అఖిలేష్ నిక్కర్లు వేసుకుంటున్నప్పటి నుంచి తనకు తెలుసని... చదువులు, ఎదుగుదల, వ్యక్తిగత జీవితం ఇలా అన్ని విషయాల్లో అతని వెనుకున్నా... ఇప్పుడు నన్నే ద్వేషిస్తున్నాడు.. అంటూ అమర్ సింగ్ భావోద్వేగానికి లోనయ్యారు. మన అనుకున్న వ్యక్తులే మనల్ని ద్వేషిస్తే ఎలా తట్టుకోగలం? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన గురించి అఖిలేష్ మాట్లాడుతున్న మాటలు వింటుంటే గుండె తరుక్కుపోతోంది అన్నారు. మరోమాట లేకుండా తనను పార్టీ నుంచి గెంటేయాలంటూ అఖిలేష్ డిమాండ్ చేయడం బాధాకరమని చెప్పారు. వాస్తవానికి తనకున్నవి రెండే కోరికలని... ఒకటి పార్టీ సుప్రీమోగా ములాయం ఉండాలని, రెండోది రాజకీయాల్లో అఖిలేష్ ఇంకా ఉన్నత స్థానానికి ఎదగాలని తెలిపారు.

వాస్తవానికి ఢిల్లీ నుంచి లక్నోకు వస్తున్న ములాయంకు ఎయిర్ పోర్టులో స్వాగతం పలకాలని అఖిలేష్ అనుకున్నారట. కానీ, చివరి క్షణంలో ఆయన మనసు మార్చుకున్నారట. శకుని మామ (అమర్ సింగ్) పక్కన ఉంటే మనమెలా వెళతాం? అని అఖిలేష్ వ్యాఖ్యానించాడట. ఈ నేపథ్యంలోనే అమర్ సింగ్ తన మనసులోని బాధను వెళ్లగక్కారు.

More Telugu News