: సీఎం చంద్రబాబును చూస్తోంటే ఎంతో నేర్చుకోవాలనిపిస్తోంది: జీఎంఆర్ చైర్మన్ గ్రంథి మల్లికార్జునరావు

సీఎం చంద్రబాబు నిర్వహించిన అధికారిక కార్యక్రమాల్లో తాను పాల్గొనడం ఇదే మొదటిసారని, ఆయన్ని చూస్తోంటే ఎంతో నేర్చుకోవాలనిపిస్తోందని జీఎంఆర్ చైర్మన్ గ్రంథి మల్లికార్జునరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని రాజాంలో ఈ రోజు నిర్వహించిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. చంద్రబాబు ఆహ్వానం మేరకు అక్కడ నిర్వహించిన బహిరంగసభకు మల్లికార్జునరావు హాజరయ్యారు.

ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల గురించి ఆ సభలో సీఎం చెబుతుంటే, ఇన్ని పథకాలను అమలు చేస్తోందా? అని ఆశ్చర్యపోయానని, ఈ విషయం నిజంగా తనకు తెలియదని, నిరుపేదల కోసం ఇన్ని పథకాలు అమలు చేయడం చిన్న విషయం కాదని ఆయన కొనియాడారు.  రాజాం నగర పంచాయతీని అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు ఎంతో శ్రద్ధ వహిస్తున్నారని, తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా గ్రంథి మల్లికార్జునరావు హామీ ఇచ్చారు.

More Telugu News