air india: రైలు టికెట్ల ధరకే విమానం ఎక్కండి: ఎయిరిండియా బంపర్ ఆఫ‌ర్‌

రైలు టికెట్ల ధరకే విమానం ఎక్కండని ప్ర‌క‌టిస్తూ ఎయిరిండియా రిపబ్లిక్ డే ఆఫర్ కింద విమానటికెట్ల ధరలను భారీగా త‌గ్గించేసింది. రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ఏసీ టూటైర్ టికెట్ల ధరలకే విమాన టిక్కెట్లను అందించ‌నున్న‌ట్లు పేర్కొంది. స్వదేశీ రూట్లలో ప్ర‌యాణించేందుకు ప్రారంభించిన ఈ ఆఫర్ ను వినియోగించుకొని ఈ నెల‌ 26 నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు ప్రయాణాలు చేయొచ్చు. ఇందుకోసం నేటి నుంచి ఏప్రిల్ పదో తేదీ వరకు టికెట్లు బుక్ చేసుకోవ‌చ్చు.  

అయితే, ఆ ఆఫ‌ర్‌తో విమానాల్లో ప్రయాణించాల‌నుకునే వారు కనీసం 20 రోజుల ముందుగా టికెట్లు బుక్ చేసుకోవాలని చెప్పింది. ఢిల్లీ, జమ్ము రూట్‌లో టిక్కెట్ ధ‌ర‌ రూ. 1610గా ఉంటుంద‌ని తెలిపింది. రూ. 2401తో ఢిల్లీ, ముంబై మార్గంలో వెళ్లేందుకు, రూ.2952తో ఢిల్లీ, బెంగళూరు మార్గంలో వెళ్లేందుకు టిక్కెట్లు పొంద‌వ‌చ్చ‌ని ప్ర‌క‌టించింది.

ఇక‌ ఢిల్లీ నుంచి చెన్నై మార్గంలో వెళ్లే టిక్కెట్ ధ‌ర‌ రూ.3100గా ప్ర‌క‌టించింది. ఈ ఆఫ‌ర్‌ కింద ఎన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయో తెల‌ప‌లేదు. అయితే, సీట్లు పరిమితంగానే ఉన్నాయ‌ని, ఎవ‌రు ముందు బుక్ చేసుకుంటే వారికే సీట్లు ల‌భిస్తాయ‌ని తెలిపింది. ఇత‌ర విమాన కంపెనీలు కూడా ఇటీవ‌ల ప‌లు ఆఫ‌ర్లను ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

More Telugu News