: ఆరేళ్ల భూటాన్ యువరాజు నోట గతజన్మ సంగతులు.. 824 ఏళ్ల క్రితం నలందలో చదువుకున్నాడట!.. మనవడితో కలసి భారత్ వచ్చిన మహారాణి!

భూటాన్ రాజకుటుంబంలో ఆరేళ్ల క్రితం జన్మించిన యువరాజుది పునర్జన్మా? వాళ్లమ్మతో ఇండియాకు వచ్చి తన పాత జ్ఞాపకాలను నెమరేసుకుంటున్న ఈ చిన్నారిని చూస్తే నిజమే అనిపించక మానదు. తన కుమారుడితో నలంద ప్రాంతానికి వచ్చిన నేపాల్ రాజమాత, ఆ బుడతడు చెబుతున్న విషయాలను చూసి ఆశ్చర్యపోతుండగా, ఆ వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తాను 824 ఏళ్ల తరువాత పునర్జన్మ పొందానని, గతంలో ఇక్కడే చదువుకున్నానని చెబుతూ, అక్కడి భోజనశాల, తరగతులు, హాస్టల్ ఎక్కడున్నాయో చూపుతున్నాడీ బుడతడు.

"పునర్జన్మలో మా మనవడు పుట్టాడు. ఆయన ఇక్కడే చదువుకున్నాడని మేం నమ్ముతున్నాం. ఈ పరిసరాలను ఆయన గుర్తు పట్టాడు. ఇక్కడి కట్టడాలు శిథిలమైపోయాయని అంటుంటే నమ్ముతున్నాం" అని భూటాన్ మహారాణి, రాజమాత దోర్జి వాంగ్ చుక్ వ్యాఖ్యానించారు. తన మనవడితో కలసి భారత పర్యటనకు వచ్చిన ఆమె, నలంద ప్రాంతంలో మనవడు చెబుతున్న వందల ఏళ్ల నాటి సంగతులను మీడియాతో పంచుకున్నారు.

తాను చిన్నతనంలో ఇక్కడికి వచ్చానని, ఈ ప్రాంతంలో ఆడుకున్నానని వేలు పెట్టి చూపిస్తున్న యువరాజు వీడియో ఇప్పుడు టీవీ చానళ్లలో వైరల్. "గత జన్మలో నలంద విశ్వవిద్యాలయంలో చదువుకున్నానని మా మనవడు చెబుతున్నాడు. ఇక్కడి దారులన్నీ ఆ పసివాడికి గుర్తున్నాయి. ఇప్పుడున్న ప్రాంతంలో ఎనిమిది దశాబ్దాల క్రితం ఏఏ వస్తువులున్నాయో చెబుతుంటే ఆశ్చర్యపోయాం. అవన్నీ నిజమే. ఇండియాలో పర్యటిస్తున్న ఈ రోజులు మాకు చాలా ప్రత్యేకమైనవి. వీటిని జీవితాంతం గుర్తుంచుకుంటాం" అని దోర్జీ వ్యాఖ్యానించారు.

More Telugu News