: అణ్వస్త్రాలపై భారత్ పరిధులు దాటేసింది!: చైనా మీడియా హెచ్చరిక

అణ్వస్త్రాలపై, లాంగ్ రేంజ్ క్షిపణులపై ఐక్యరాజ్యసమితి విధించిన అన్ని నిబంధనలనూ భారత్ దాటేసిందని చైనా ప్రభుత్వ మీడియా హెచ్చరించింది. అగ్ని-4, 5 క్షిపణుల పరీక్ష తరువాత చైనాలోని ఏ ప్రాంతాన్నైనా టార్గెట్ చేయగల సత్తాను భారత్ సాధించగా, దాన్ని చూసిన చైనా ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. "యూఎన్ అవధులన్నింటినీ పట్టించుకోకుండా భారత్ అణ్వస్త్రాలను, ఖండాంతర క్షిపణులను అభివృద్ధి చేస్తోంది. అమెరికా సహా పలు పశ్చిమ దేశాలు సైతం ఇదే పని చేస్తున్నాయి. ప్రపంచంలోని ఏ ప్రాంతాన్నైనా లక్ష్యంగా చేసుకుని అణ్వాయుధాలు జారవిడేచే సామర్థ్యానికి చేరుతోంది" అని ప్రభుత్వ రంగ 'గ్లోబల్ టైమ్స్' సంపాదకీయం రాసింది.

యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ లోని ఐదు శాశ్వస సభ్య దేశాలతో సమానమైన అణు శక్తిని భారత్ కలిగివుందని పేర్కొంది. ఇండియాకున్న ఆర్థిక బలం, అణు సామర్థ్యంతో యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో శాశ్వత స్థానం కోసం ప్రయత్నిస్తోందని ఆరోపించింది. భారత లాంగ్ రేంజ్ క్షిపణుల అభివృద్ధిపై చైనా జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది.

More Telugu News