: నా పిల్లలు ఏ మతానికి చెందినవారో పండగలే డిసైడ్ చేస్తాయి!: బాలీవుడ్ దర్శకుడు శిరీష్ కుందర్

బాలీవుడ్ దర్శకుడు శిరీష్ కుందర్ ఓ నెటిజన్ కు చెప్పిన సమాధానం సోషల్ మీడియాలో అందర్నీ ఆకట్టుకుంటోంది. వివరాల్లోకి వెళితే, న్యూఇయర్ వేడుకలకు భార్య, దర్శకురాలు ఫరా ఖాన్, పిల్లలు సీజర్, అన్య, దివాలతో అమెరికా వెళ్లిన శిరీష్ కుందర్ గ్రాండ్ కెనాన్ వద్ద తన కుటుంబానికి తీసిన ఫోటోను తన ఖాతాలో పోస్టు చేస్తూ, తన కుటుంబం ఇక్కడ ఫోటో దిగడం ఆనందంగా ఉందని పేర్కొన్నాడు.

దీంతో అతని ట్విట్టర్ ను అనుసరించే ఫాతిమా ఆర్య అనే యువతి, 'ఇంతకీ నీ పిల్లలు హిందువులా? ముస్లింలా?' అని అడిగింది. శిరీష్ హిందూ కాగా, ఫరా ఖాన్ ముస్లిం. ఈ నేపథ్యంలో వారి పిల్లలు ఏ మత సంప్రదాయాలను ఆచరిస్తారన్న కోణంలో ఆమె ప్రశ్న సంధించింది. దీనికి శిరీష్ కుందర్ సమాధానమిస్తూ, అది తరువాత వచ్చే పండగ మీద ఆధారపడి ఉంటుందని అన్నాడు. 'గత నెలలో క్రిస్మస్ చేసుకున్నారు. అప్పుడు వారు క్రిస్టియన్స్, తరువాత ఏ పండగ వస్తే అందుకు అనుగుణంగా వారు మారుతారు' అని సమాధానమిచ్చాడు. ఇది అతని అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. దీనిపై ఒక నెటిజన్ స్పందిస్తూ, ఈ మధ్య కాలంలో మతానికి ఇంత గొప్ప సమాధానం ఇవ్వడాన్ని తాను చూళ్లేదని తెలిపాడు. 

More Telugu News