: డిజిటల్ చెల్లింపుల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయా?.. ఈ నెంబరుకి ఫోన్ చేయండి: కేంద్ర ప్రభుత్వం
పెద్దనోట్ల రద్దు అనంతరం దేశంలో డిజిటల్ చెల్లింపులు చేస్తున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ(బీహెచ్ఐఎం), ఈ-వ్యాలెట్లు, ఆధార్ అనుసంధాన చెల్లింపుల ద్వారా ప్రజలు నగదురహిత లావాదేవీలు కొనసాగిస్తున్నారు. అయితే, ఈ క్రమంలో వినియోగదారులు, వ్యాపారులకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం ఓ టోల్ ఫ్రీ నెంబరుని తీసుకొచ్చింది. టెలికాం, ఐటీశాఖల సాయంతో ఈ సర్వీసుని కొనసాగిస్తోంది. నగదురహిత లావాదేవీలు చేస్తోన్న క్రమంలో ప్రజలు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కుంటే 14444 టోల్ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి నిపుణుల సూచనలు తీసుకోవచ్చని, పరిష్కారం కనుగొనవచ్చని చెప్పారు.
ఈ నంబరుని ఇప్పటికే ఉత్తరాది, తూర్పు రాష్ట్రాల్లో అందుబాటులోకి తీసుకొచ్చామని, ప్రజలు ఇంగ్లీష్, హిందీ భాషల్లో నిపుణుల నుంచి సమాధానాలు రాబట్టవచ్చని సంబంధిత అధికారులు తెలిపారు. త్వరలోనే దేశంలోని అన్ని భాషల్లోనూ ఈ సర్వీసుని తీసుకొస్తున్నట్లు తెలిపారు.