: నా అనుభవం వల్లే పోలవరానికి జాతీయ హోదా, నాబార్డు రుణం వచ్చాయి: చంద్రబాబు

తన అనుభవం వల్లే పోలవరం ప్రాజెక్టుకి జాతీయ హోదా, నాబార్డు నుంచి రుణం వచ్చాయని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. అనంతపురం జిల్లా బుక్కపట్నంలో నిర్వహించిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తొలుత బుక్కపట్నం చెరువును పరిశీలించారు. అనంతరం జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ, పుట్టపర్తికి ఇబ్బంది కలగని రీతిలో బుక్కపట్నం చెరువు ఎత్తు పెంచుతామని, బుక్కపట్నం చెరువు మరమ్మతులకు రూ.10 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.

కొత్తచెరువు-బుక్కపట్నం-పుట్టపర్తి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తామని చంద్రబాబు చెప్పారు. అనంతపురం జిల్లాకు తాగునీటి ఎద్దడి లేకుండా శాశ్వత చర్యలు చేపడతామని, హంద్రీనీవా ద్వారా జిల్లాలో 1,260 చెరువులు నింపుతామని అన్నారు. అనంతపురం జిల్లా చరిత్రను తిరగరాస్తానని, రాయలసీమకు ముచ్చుమర్రి ముఖద్వారమని, మరో రెండు, మూడు పంపులు ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యాక తుంగభద్ర నీళ్లు రాకపోయినా, కృష్ణా జలాలను రాయలసీమకు తరలిస్తామని, శ్రీశైలం డెడ్ స్టోరేజ్ నుంచి కూడా నీళ్లు తీసుకునే అవకాశం ఉందని, ముచ్చుమర్రి ద్వారా హంద్రీనీవాకు తరలించి అనంతపురం జిల్లాకు తాగు నీటి ఎద్దడి లేకుండా శాశ్వత చర్యలు చేపడతామని చంద్రబాబు స్పష్టం చేశారు.

More Telugu News