: కుటుంబంలోని 10 మందిని చంపేసి... ఆత్మహత్య చేసుకున్నాడు!

రాత్రి పడుకునేంత వరకు బాగానే ఉంది. తెల్లారే సరికి ఇల్లు మొత్తం శవాల దిబ్బలా మారిపోయింది. ఈ దృశ్యాన్ని చూసి, చుట్టుపక్కల వాళ్లే కాదు... పోలీసులు సైతం షాక్ కు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే, ఉత్తరప్రదేశ్ లోని అమేథీ పార్లమెంటు నియోజకవర్గంలోని సుల్తాన్ పూర్ జిల్లా సకుల్ బజార్ గ్రామంలో ఈ ఘటన జరిగింది.

ప్రాథమిక సమాచారాన్ని బట్టి... జమాలుద్దీన్ అనే వ్యక్తి స్థానిక బ్యాటరీ షాపులో పనిచేస్తుంటాడు. రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో ఇంటికి వచ్చిన జమాలుద్దీన్... చప్పుడు కాకుండా కత్తితో భార్య, పిల్లలు, బంధువులను ఒకరి తర్వాత మరొకరిని చంపేశాడు. ఆ తర్వాత ఇంట్లోనే ఉరి వేసుకుని ప్రాణాలు వదిలాడు. తెల్లారిన తర్వాత ఈ ఘోరాన్ని చుట్టుపక్కల వారు గమనించి, పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు అక్కడకు చేరుకునే సమయానికి... జమాలుద్దీన్ భార్య మాత్రం గొంతు తెగిపోయి, కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. ఆమెను హుటాహుటీన సుల్తాన్ పూర్ లోని ఆసుపత్రికి తరలించారు. ఆమె కూడా మాట్లాడలేని పరిస్థితిలో, అత్యంత విషమ పరిస్థితిలో ఉంది. జమాలుద్దీన్ ఇంత దారుణానికి ఎందుకు ఒడిగట్టాడన్న విషయం మాత్రం ఇంతవరకు తెలియరాలేదు. చెప్పడానికి కూడా బతికున్నవారు ఎవరూ లేరు.

More Telugu News