: ఆదాయపు పన్ను శాఖ మరో అస్త్రం... ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టీ లావాదేవీలపై దృష్టి!

పన్ను పరిమితులను అధిగమించి ఆదాయాన్ని పొందుతున్న వారి నుంచి పన్ను రాబట్టడమే లక్ష్యంగా ఆదాయపు పన్ను శాఖ మరో కీలక అడుగు వేస్తోంది. పెద్ద నోట్ల రద్దు తరువాత బ్యాంకు ఖాతాదారులు జరిపిన ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టీ లావాదేవీలపై దృష్టిని సారించింది. ఈ మేరకు బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలను జరిపిన వారి వివరాలు సేకరిస్తోంది. ఇప్పటికే బ్యాంకులు జారీ చేసిన యునీక్ ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ నంబర్లను, వాటి నుంచి బదిలీ అయిన నగదు మొత్తం వివరాలనూ వెల్లడించాలని కోరినట్టు ఆదాయపు పన్ను శాఖ అధికారి ఒకరు తెలిపారు.

మొత్తం లావాదేవీలను పరిశీలించేందుకు నిబద్ధత, అంకితభావంతో కూడిన అధికారులతో ఓ టీమ్ ను నియమించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భావిస్తున్నట్టు సదరు అధికారి తెలియజేశారు. ఆపై అనుమానం వచ్చిన లావాదేవీలపై విచారణ జరపాలని భావిస్తున్నట్టు తెలిపారు. నోట్ల రద్దు తరువాత పెద్ద ఎత్తున ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టీ లావాదేవీలు జరిగిన సంగతి తెలిసిందే. ఐటీ శాఖ తాజా ఆలోచనలతో తమ ఖాతాల్లో డబ్బులు డిపాజిట్ చేసి వేరే ఖాతాలకు మళ్లించిన వారంతా ఆందోళన చెందుతున్నారు.

More Telugu News