: బెంగళూరుకు మరింత సిగ్గు చేటు... నడివీధిలో యువతిపై అరాచకం!

నూతన సంవత్సరం శుభవేళ బెంగళూరు వీధుల్ల మహిళలపై జరిగిన అకృత్యాలను మరచిపోకముందే, ఐటీ సిటీకి మరింత సిగ్గు చేటును తెస్తున్న మరో వీడియో ఫుటేజ్ బయటకు వచ్చింది. ఓ యువతి నడిచి వెళుతుండగా, ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు యువకులు ఆమెను చుట్టుముట్టి వేధించారు. ఆదివారం రాత్రి 2:30 గంటల సమయంలో తూర్పు బెంగళూరులోని కమ్మనహళ్లి 5వ మెయిన్ రోడ్డుపై ఓ ఇంట్లో అమర్చిన సీసీ టీవీ కెమెరాల్లో ఈ దృశ్యాలు నమోదయ్యాయి.

ఆటో దిగి తన ఇంటివైపు నడిచి వెళుతున్న యువతిని స్కూటర్ పై వచ్చిన ఇద్దరు యువకులు వెంబడించారు. వీరిద్దరిలో ఒకరు ఆమెను గట్టిగా పట్టుకున్నాడు. అయితే, ఆ యువతి ధైర్యంగా ఎదిరించి, అతడి చెంపపై ఒక్కటివ్వగా, ఆగ్రహంతో అతను ఆమెను లాగి కింద పడేసిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. యువతి బాధతో ఏడుస్తుంటే, ఆ దారిన పోతున్న వారు చూస్తూ ఆగిపోయారే తప్ప, ఒక్కరైనా ఆమెకు సాయపడేందుకు ముందుకు రాలేదు. బాధలోనూ ఆమె వారిద్దరితో పోరాడింది. చుట్టూ మూగుతున్న జనాల సంఖ్య పెరగడంతో, వారు అమెను గట్టిగా నెట్టేసి తమ వాహనం ఎక్కి పారిపోయారు. ఈ వీడియో మీడియాలో సంచలనం కలిగించగా, పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ ని పరిశీలిస్తున్నట్టు తెలిపారు.

More Telugu News