: భక్తులు తెచ్చే బియ్యం నాణ్యతపై డౌట్.. శబరిమలలో అప్పం ప్రసాదం తయారీ నిలిపివేత?
అరవణ, అప్పం... పరిచయం అక్కర్లేని అయ్యప్ప ప్రసాదం. శబరిమలలో భక్తులు పరమ పవిత్రంగా భావించి, తెచ్చి అందరికీ పంచే ప్రసాదం. ఇక అప్పం కనుమరుగు కానుందని తెలుస్తోంది. భక్తులు తమ ఇరుముడులలో తెచ్చే బియ్యంతో అప్పం ప్రసాదాన్ని తయారు చేసి విక్రయిస్తుంటారు. ఈ బియ్యంలో నాణ్యతపై ఫుడ్ సేఫ్టీ అధికారులు అనుమానాలు వ్యక్తం చేయడంతో ఆలయ ప్రత్యేక కమిషనర్ అప్పం ప్రసాద పంపిణీని ఆపివేయాలని ఆదేశాలు జారీ చేశారు.
అప్పం తయారీ నిలపాలని ఆయన ఆదేశించడాన్ని కేరళ దేవాదాయ, పర్యాటక మంత్రి కడకంపల్లి సురేంద్రన్ తీవ్రంగా విమర్శించారు. మకరవిళక్కు దగ్గరకు వచ్చిన వేళ, కోట్లాది మంది భక్తులు శబరిమలకు చేరుకుంటుంటే, ఇప్పుడు వారి మనోభావాలు దెబ్బతినేలా ప్రసాదం తయారీ ఆపివేయాలన్న ఆదేశాలు ఇవ్వడం అర్థం లేనిదని విమర్శించారు. భక్తులు తెచ్చే బియ్యం నాణ్యతను తప్పు పట్టాల్సిన అవసరం లేదని తెలిపారు.