: బలూచిస్థాన్ పై విరుచుకుపడిన పాక్ ఆర్మీ.. నరమేధం.. గుట్టలుగా శవాలు!

స్వాతంత్ర్యం కోసం తీవ్రంగా పోరాడుతున్న బలూచిస్థాన్ లో పాక్ ఆర్మీ నరమేధం సృష్టించింది. రెండు రోజుల క్రితం పాక్ మిలటరీ బలూచిస్థాన్‌ లోని బోలన్ జిల్లాలోని గ్రామాలపై విరుచుకుపడింది. విచక్షణా రహితంగా ప్రజలపై కాల్పులకు తెగబడింది. పాక్ ఆర్మీ దురాగతం నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన ప్రజలపై హెలికాప్టర్లతో బాంబు దాడులకు దిగింది. దీంతో గ్రామాలకు గ్రామాలు శవాల దిబ్బలుగా మారాయి. అంతే కాదు, చాలా గ్రామాల్లో ఇల్లన్నదే కనిపించకుండా పోయింది.

ఈ దారుణం ఎంత తీవ్రంగా ఉందంటే.. మరణించిన వారి కుటుంబ సభ్యులను చూసి ఏడ్చేందుకు కూడా ఎవరూ మిగలనంతగా అక్కడి ప్రజలను కాల్చిపారేసినట్టు తెలుస్తోంది. బాధితుల్లో కొందరు తీసిన వీడియో వెల్లడి కావడంతో పాక్ పాశవికచర్య బట్టబయలైంది. కశ్మీర్‌ లో మానవహక్కుల ఉల్లంఘన జరిగిపోతోందని గగ్గోలు పెట్టే పాకిస్థాన్ కుయుక్తి ఈ వీడియోతో ప్రపంచానికి బట్టబయలైంది. రెండు రోజుల క్రితం పాక్ దళాలు బలూచిస్థాన్ లో నరమేధానికి పాల్పడిన మాట వాస్తవమేనని బలూచ్ హక్కుల నేత తారెక్ ఫతే పేర్కొన్నారు. ఈ సందర్భంగా భారత్ తమను ఆదుకోవాలని ఆయన కోరారు.

More Telugu News