: సీఎంగా పన్నీర్ సెల్వం ఎంపికలో నా ప్రమేయం లేదు: వెంకయ్య

తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వంను ఎంపిక చేయడం వెనుక తన హస్తం లేదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. పన్నీర్ సెల్వం ఎంపికలో తన పాత్ర ఉందన్న వార్తలను ఆయన కొట్టి పడేశారు. సీఎం పదవికి ఆయన పేరును ప్రతిపాదించడానికి తానెవరినని... ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆయన పేరును ప్రతిపాదించారని చెప్పారు.

జయలలిత మృత దేహాన్ని మళ్లీ బయటకు తీసి పరీక్షలు నిర్వహించాలన్న డిమాండ్ ను వెంకయ్య వ్యతిరేకించారు. జయలలిత అనారోగ్యానికి గురయ్యారని... ఆమెకు చికిత్స అందించిన వైద్యులను అనుమానించడం సబబు కాదని అన్నారు. కొందరు అనుమానపక్షులు ఎప్పుడూ అనుమానాలను వ్యక్తం చేస్తూనే ఉంటారని విమర్శించారు.

తన గొప్ప వ్యక్తిత్వంతో తమిళనాడు వ్యాప్తంగా జయలలిత తీవ్ర ప్రభావాన్ని చూపారని... బీజేపీ సానుభూతిపరులు సైతం ఆమెకే ఓటు వేసేవారని వెంకయ్యనాయుడు చెప్పారు. ఆమె మరణం తర్వాత ఆ పరిస్థితి లేదని... ఇది బీజేపీకి లాభించే అంశమని తెలిపారు. డీఎంకే కన్నా అన్నాడీఎంకే ఉత్తమమైన పార్టీ అని చెప్పారు. 

More Telugu News