: ఇక మీరు రావాల్సిందే...!: రజనీకాంత్ పై ఒత్తిడి పెంచుతున్న అభిమానులు!

తమిళనాట రాజకీయాలు రంగు మారుతున్నాయి. ముఖ్యంగా అధికారిక అన్నాడీఎంకే పార్టీ పగ్గాలను శశికళ చేపట్టడం చాలా మందికి మింగుడు పడటం లేదు. దీనికి తోడు, ఏకంగా సీఎం పదవినే చేపట్టాలంటూ... కొందరు నేతలు శశికళను కోరుతుండటం పలువురికి ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. ముఖ్యంగా, కింది స్ధాయి పార్టీ కార్యకర్తలు శశికళను ఏమాత్రం ఆమోదించడం లేదు.

ఈ నేపథ్యంలో, రజనీకాంత్ పేరు ఒక్కసారిగా తెరపైకి వచ్చింది. ఆయన అభిమానులు రజనీ అరంగేట్రం చేయాల్సిందేనంటూ డిమాండ్ చేస్తున్నారు. తమిళనాడులో రాజకీయ నేతల అవినీతి పెరిగిపోయిందని... అరాచకాలు రాజ్యమేలుతున్నాయని... వాటిని అంతమొందించాలంటే రజనీ లాంటి సమర్థుడు రాజకీయాల్లోకి రావాల్సిందేనని కోరుతున్నారు. తమిళనాడు రాష్ట్రం బాగుపడాలంటే... అది రజనీ వల్లే సాధ్యమని చెబుతున్నారు. అంతేకాదు చెన్నై, తిరుచ్చి తదితర ప్రాంతాల్లో రజనీ ఫొటోలతో కూడిన పోస్టర్లు కూడా వెలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో, రజనీకాంత్ ను ప్రత్యక్షంగా కలిసి, రాజకీయాల్లోకి రావాలని ఒత్తిడి తీసుకొస్తామని ఆయన అభిమానులు వెల్లడించారు. మరి, రజనీకాంత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. 

More Telugu News