: చిన్నమ్మకు లైన్ క్లియర్... ప్రకటన విడుదల చేసిన తంబిదురై
ఇప్పటికే అన్నాడీఎంకే పగ్గాలను చేపట్టిన శశికళ... తమిళనాడు సీఎం పీఠం వైపు వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఏ క్షణమైనా ముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టడానికి ఆమె సిద్ధమవుతున్నారు. అన్నాడీఎంకే సీనియర్ నేత, లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై ఈ రోజు ఓ ప్రకటనను మీడియాకు విడుదల చేశారు. జయలలిత చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవడానికి చిన్నమ్మ శశికళే సరైన వ్యక్తి అని నాలుగు పేజీల ప్రకటనలో తెలిపారు. పార్టీ ఒకరి చేతిలో, ప్రభుత్వం మరొకరి చేతిలో ఉంటే రెండు పవర్ సెంటర్లు ఉంటాయని... ఇది రాష్ట్ర అభివృద్ధికి మంచిది కాదని చెప్పారు. శశికళ వెంటనే ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలని ప్రకటనలో విన్నవించారు. మరోవైపు, అన్నాడీఎంకే విడుదల చేసిన ప్రకటనపై ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఇంతవరకు స్పందించలేదు.