: మైదానంలో గాయపడ్డ బ్రావో...బీబీఎల్ నుంచి అవుట్

వెస్టిండీస్‌ ఆల్‌ రౌండర్‌ డ్వేన్‌ బ్రావో బిగ్‌ బాష్‌ లీగ్‌ (బీబీఎల్‌) లో గాయపడ్డాడు. బిగ్ బాష్ లీగ్ లో మెల్‌ బోర్న్‌ రెనిగేడ్స్‌ జట్టు తరఫున బరిలో దిగాడు. పెర్త్‌ స్కాచర్స్‌- మెల్‌ బోర్న్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతుండగా, మైదానంలో బ్రావో తొడ కండరాలు పట్టేశాయి. దీంతో బ్రావో నడిచేందుకు కూడా తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. వెంటనే రంగప్రవేశం చేసిన ఫిజియోలు స్ట్రెచర్ పై అతనిని బయటకు తీసుకెళ్లారు. అనంతరం స్కాన్ చేయగా, శస్త్రచికిత్స అవసరమైందని, త్వరలోనే ఫిట్ నెస్ సంపాదించి మళ్లీ మైదానంలో అడుగుపెడతానని బ్రావో బీబీఎల్ వెబ్ సైట్ లో పేర్కొన్నాడు.

దీనిపై మెల్ బోర్న్ రెనిగేడ్స్ జట్టు కెప్టెన్ ఆరోన్ ఫించ్ మాట్లాడుతూ, బ్రావో టోర్నీకి దూరమవ్వడం బాధాకరమని అన్నాడు. బ్రావో ప్రపంచంలో నాణ్యమైన ఆల్ రౌండర్ అని, అతను లేని లోటు జట్టుపై ప్రభావం చూపుతుందని స్పష్టం చేశాడు. కాగా, శస్త్ర చికిత్స కారణంగా బ్రావో ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభం కానున్న పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్ కు కూడా దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ టోర్నీలో బ్రావో లాహోర్ కలందర్స్ జట్టు తరపున ఆడనున్నాడు. 

More Telugu News