demonitisation: బ్యాంకుల్లో జమ అయిన పాతనోట్ల వివరాలు చెప్పండి: ఆర్బీఐ ఆదేశాలు

ర‌ద్ద‌యిన నోట్ల‌ను ఏ నిబంధ‌న‌లు లేకుండా ఖాతాదారులు బ్యాంకుల్లో జ‌మ చేసుకునేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చిన గ‌డువు నేటితో ముగియ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో బ్యాంకుల‌కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రోజు ప‌లు ఆదేశాలు జారీ చేసింది. రద్దయిన నోట్ల డిపాజిట్లకు సంబంధించిన అన్ని వివ‌రాల‌ను త‌మ‌కు ఇవ్వ‌వ‌ల‌సిందిగా ఈ-మెయిళ్ల ద్వారా ఆదేశించింది. ఈ రోజు వ‌ర‌కు బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్‌ అయిన పాత నోట్ల వివరాలను చెప్పాల‌ని సూచించింది. స్పెసిఫైడ్ బ్యాంక్ నోట్స్ స్వీక‌ర‌ణ‌ల సమాచారాన్ని మొత్తం రిపోర్ట్ చేయాలని పేర్కొంటూ, అందుకు ప‌లు మార్గదర్శకాలు జారీ చేసింది. డీసీసీబీ త‌ప్ప‌ దేశంలోని అన్ని బ్యాంకులు త‌మ త‌మ బ్యాంకు బ్రాంచ్‌ల నుంచి పాతనోట్ల డిపాజ‌ట్ల వివ‌రాల‌ను సేక‌రించాల‌ని చెప్పింది. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాల‌ని సూచించింది.
 
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం పెద్ద‌నోట్లు ర‌ద్దు కాక‌ముందు దేశంలో రూ.15.4 లక్షల కోట్ల విలువైన 500, 1000 రూపాయ‌ల నోట్లు చలామణిలో ఉన్నాయి. కాగా, దేశం మొత్తం మీద రూ.14 లక్షల కోట్ల పాత నోట్లు జ‌మ అయ్యాయి. ఈ న‌గదు మొత్తం రద్దయిన నోట్లలో 90 శాతంగా ఉంది.

More Telugu News