: నయీంకు రాజకీయనాయకులు, పోలీసులతో సంబంధం లేదు: కోర్టుకు తెలిపిన తెలంగాణ ప్రభుత్వం

కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ నయీంకు రాజకీయ నాయకులు, పోలీసులతో సంబంధాలు లేవని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. నయీం కేసుతో రాజకీయ నాయకులు, పోలీసులకు సంబంధాలు ఉన్నాయని, సిట్ విచారణలో ఈ వాస్తవాలు వెలుగు చూస్తాయన్న నమ్మకం లేదని, ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ సీపీఐ నేత నారాయణ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ కు కౌంటర్ దాఖలు చేసిన తెలంగాణ ప్రభుత్వం ఈ కేసులో నయీంతో రాజకీయ నాయకులు, పోలీసులకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.

మాజీ డీజీపీ నయీంకు సహకరించాడన్న ఆరోపణలు, అంతర్జాతీయ ఉగ్రవాది, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు నయీం సహకరించినట్టు వచ్చిన వార్తలన్నీ అవాస్తవాలని ప్రభుత్వం తెలిపింది. ఈ కేసులో ఆరోపణలు వచ్చిన టీడీపీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య సహా చాలా మందిని విచారించామని, అయితే ఆరోపణలకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ కేసును సీబీఐకి అప్పగించే ఆలోచన లేదని, సిట్ దర్యాప్తు చేస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. 

More Telugu News