: మనవాళ్లు ఎక్కువగా శోధించింది ఈ స్మార్ట్ ఫోన్ల కోసమే!

2016లో మన దేశీయులు ఎక్కువగా శోధించిన స్మార్ట్ ఫోన్లు ఏవేవో తెలుసుకోవాలని ఉందా...? ఆ మధ్య రూ.251కే ఫ్రీడమ్ ఫోన్ అంటూ ఓ సంస్థ ఊదరగొట్టిన విషయం ఇంకా గుర్తుండే ఉంటుంది. రూ.251కే ఫోన్ అందిస్తామని, ఆసక్తి గల వారు తమ వెబ్ సైట్లో బుక్ చేసుకోవాలని ప్రకటన చేసి అందరి దృష్టిలో పడింది రింగింగ్ బెల్స్ అనే సంస్థ. ఆ తర్వాత దీని గురించి కంపెనీ తరఫున ఎలాంటి ప్రకటనా రాలేదు. 2016లో గూగుల్ సెర్చింజిన్ లో భారతీయులు ఎక్కువగా వెతికింది ఈ స్మార్ట్ ఫోన్ కోసమేనట. ఫ్రీడమ్ ఫోన్ తర్వాతి స్థానంలో యాపిల్ ఐఫోన్ 7 ఉంది. అధిక ధర ఉన్నా... దీని గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఎంతో మందిలో ఉందని శోధన ఫలితాలను బట్టి తెలుస్తోంది.

రెడ్ మీ నోట్ 3 మూడో స్థానంలో నిలిచింది. ధర రూ.10వేల లోపు ఉండడం, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్, 16 మెగాపిక్సల్స్ కెమెరా తదితర ఆకర్షణలు ఈ ఫోన్ ను ముందుంచాయి. ఇక నాలుగో స్థానంలో లెనోవో కే4 నోట్ ఉంది. ఆక్టాకోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 3జీబీ ర్యామ్ తదితర సదుపాయాలతో ఉన్న ఈ ఫోన్ ధర రూ.12,000. వన్ ప్లస్ 3 తర్వాత స్థానం దక్కించుకుంది. 64జీబీ అంతర్గత స్టోరేజీ సామర్థ్యం, ఇంకా విస్తరించుకునేందుకు వీలుగా అదనపు మెమొరీ కార్డు స్లాట్ సౌకర్యం, 6జీబీ ర్యామ్ వంటి సూపర్ ఫీచర్లతో కూడుకున్న ఈ ఫోన్ గూగుల్ శోధన జాబితాలో ఐదో స్థానంలో ఉంది. ప్రపంచంలో అత్యంత ఆసక్తి రేపిన ఒకానొక స్మార్ట్ ఫోన్ శామ్ సంగ్ జే 7. 5.5 అంగుళాల హెచ్ డీ సూపర్ అమోలెడ్ డిస్ ప్లే, 1.6 గిగాహెర్జ్ ఎక్సినాస్ ఆక్టాకోర్ ప్రాసెసర్ తదితర సదుపాయాలు ఉన్న ఈ ఫోన్ ఆరో స్థానంలో ఉంది.  





More Telugu News