: ప్ర‌చార ఖ‌ర్చులో ట్రంప్ ను మించిపోయినా హిల్ల‌రీకి త‌ప్ప‌ని ఓట‌మి.. ఎవ‌రెంత ఖ‌ర్చు చేశారో వెల్ల‌డించిన అధ్య‌య‌నం

ఇటీవ‌ల జ‌రిగిన అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో హోరాహోరీగా పోటీప‌డిన రిప‌బ్లిక‌న్ అభ్య‌ర్థి డొనాల్డ్ ట్రంప్‌, డెమొక్ర‌టిక్ అభ్య‌ర్థి హిల్ల‌రీ క్లింట‌న్ త‌మ ప్ర‌చారం కోసం ఎంతెంత ఖ‌ర్చుచేశారో తెలిస్తే ఆశ్చ‌ర్యం వేయ‌క‌మాన‌దు. ట్రంప్ కంటే హిల్ల‌రీనే ఎక్కువ ఖ‌ర్చు చేసినా ప‌రాజ‌యం నుంచి మాత్రం ఆమె బయ‌ట‌ప‌డ‌లేక‌పోయారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో అభ్య‌ర్థులు స‌హా వారి  మ‌ద్ద‌తుదార్లు పెట్టిన ఖ‌ర్చు అక్ష‌రాలా 2.17 బిలియ‌న్ డాల‌ర్లు. మ‌న క‌రెన్సీలో చెప్పుకోవాలంటే రూ.14805,85,57,500 అని తేలింది. సెంట‌ర్ ఫ‌ర్ ప‌బ్లిక్ ఇంటెగ్రిటీ అండ్ అన‌లైజింగ్ ఫిగ‌ర్స్ అధ్య‌య‌నంలో ఈ విష‌యం బ‌య‌ట‌ప‌డింది.

ట్రంప్ 409  మిలియ‌న్ డాల‌ర్లు (రూ.2,789.78 కోట్లు), హిల్ల‌రీ 759 మిలియ‌న్ డాల‌ర్లు(రూ.5177.15 కోట్లు) ఖ‌ర్చు చేశార‌ని అధ్య‌యన నివేదిక పేర్కొంది. అంటే ట్రంప్ త‌న‌కు పోలైన‌ ఒక్కో ఓటుకు స‌గ‌టున 6.50 డాల‌ర్లు (రూ.443), హిల్ల‌రీ ఒక్కో ఓటుకు 11.50 డాల‌ర్లు (రూ.784.58) ఖ‌ర్చు చేశార‌న్న మాట‌.

More Telugu News