demonitisation: ‘రద్దయిన నోట్లు క‌లిగి ఉంటే నాలుగేళ్ల జైలు శిక్ష‌’.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవిగో...!

న‌ల్ల‌ధ‌నంపై ఉక్కుపాదం మోపిన కేంద్ర ప్ర‌భుత్వం దాన్ని సమూలంగా రూపుమాపాల‌నే ఉద్దేశంలో ఏ మాత్రం వెనుకంజ వేయ‌డం లేదు. బ్యాంకులో జమ చేయకుండా గడువు తీరిన తర్వాత కూడా ర‌ద్ద‌యిన నోట్లను క‌లిగిన ఉన్న వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం భావిస్తున్న విష‌యం తెలిసిందే. ఇందుకోసం అత్య‌వ‌స‌ర ఆదేశం జారీ చేయడానికి ఈ రోజు ఉద‌యం 10.30 గంట‌ల‌కు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న‌ ప్రారంభ‌మైన కేంద్ర కేబినెట్ భేటీ ముగిసింది.

తాము తీసుకురావాల‌నుకుంటున్న‌ ఆర్డినెన్స్ కు కేంద్ర కేబినెట్ ఆమోద‌ముద్ర వేసింది. త్వ‌ర‌లోనే ఈ ఆర్డినెన్స్‌ను  రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్‌ముఖ‌ర్జీ వ‌ద్ద‌కు పంపించాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. ఈ ఆర్డినెన్స్ ప్రకారం రద్దయిన నోట్లు కలిగి ఉంటే నేరంగా ప‌రిగ‌ణించి చ‌ర్య‌లు తీసుకోనున్నారు. వ‌చ్చే ఏడాది మార్చి 31 త‌రువాత పాత‌నోట్లు క‌లిగి ఉండి ప‌ట్టుబ‌డితే నాలుగేళ్ల జైలు శిక్ష విధించ‌నున్నారు. అలాగే పాత నోట్ల‌తో లావాదేవీలు జ‌రిపితే రూ.5 వేల జ‌రిమానా విధించ‌నున్నారు.

అలాగే, రద్దయిన పెద్ద‌నోట్ల‌ను ఈ నెల 30 త‌రువాత రిజ‌ర్వు బ్యాంకు ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక కౌంటర్ల ద్వారానే మార్చుకోవాల‌ని, అందుకోసం కేవైసీ ఫారాలు స‌మ‌ర్పించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. పాత‌నోట్లు జ‌మ‌ చేసుకోవాలంటే అధికారులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కి ప్ర‌జ‌లు స‌మాధానం చెప్పాల్సి ఉంటుంది. కాగా, న‌గ‌దుర‌హిత లావాదేవీలతో కాకుండా న‌గదుతో మాత్ర‌మే వ్యాపారాలు చేసే వారిపై కూడా ప‌లు ఆంక్ష‌లు విధించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

More Telugu News