hacking: హ్యాకింగ్‌కు గురైన కేంద్ర హోంశాఖ కంప్యూటర్లు.. తప్పుడు అనుమతులు మంజూరు!

కేంద్ర హోం శాఖ‌కు చెందిన కంప్యూట‌ర్లపై హ్యాక‌ర్లు దాడి చేసినట్లు తెలుస్తోంది. స‌ద‌రు కంప్యూట‌ర్‌ల నుంచి 16 ఎన్‌జీవోలు విదేశీ నిధులను స్వీకరించేందుకు వీలుగా తప్పుడు అనుమతులు జారీ అయ్యాయ‌ని నిపుణులు గుర్తించారు. ఈ విష‌యం వెలుగులోకి రావ‌డంతో సంబంధిత‌ అధికారులు వెంటనే వాటిని రద్దు చేశారు. ఈ హ్యాకింగ్ కార‌ణంగా ఫారిన్‌ కంట్రిబ్యూషన్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌ కింద నిధులను స్వీకరించడానికి ప‌లు సంస్థ‌లకు అనుమ‌తులు వ‌చ్చిన‌ట్లు న‌మోద‌యింద‌ని అధికారులు తెలిపారు.

ఈ విషయం వెలుగులోకి రావడంతో కొన్ని రోజుల క్రితం హోంశాఖ అంతర్గత దర్యాప్తునకు ఆదేశించింది. అయితే, కంప్యూటర్లలో సాంకేతిక సమస్య త‌లెత్త‌డం వ‌ల్ల ఇలా జరిగి ఉంటుందని కూడా అధికారులు భావిస్తున్నారు. ఈ రోజు కేంద్ర హోంశాఖ మంత్రి ఎన్‌జీవోలకు విదేశీ నిధులపై స‌మీక్ష ఏర్పాటు చేయ‌నున్నారు. దేశంలో సుమారు 13,000 ఎన్‌జీవోలు విదేశీ నిధులను స్వీకరిస్తున్నాయని సంబంధిత‌ అధికారులు తెలిపారు.

More Telugu News