: ఎయిరిండియా న్యూ ఇయర్ సేల్... రూ. 849కే విమానం టికెట్

ప్రభుత్వ రంగ పౌరవిమానయాన సంస్థ ఎయిర్ ఇండియా న్యూ ఇయర్ సేల్ పేరిట ఎంపిక చేసిన రూట్లలో రూ. 849కే విమాన ప్రయాణ టికెట్లను ఆఫర్ చేస్తోంది. ఈ నెలాఖరులోగా కొనుగోలు చేసే టికెట్లపై జనవరి 15 నుంచి ఏప్రిల్ 30 మధ్య ప్రయాణ తేదీలను ఎంచుకోవచ్చని ప్రకటించింది. ఆఫర్ లో భాగంగా చెన్నై - కోయంబత్తూరు, బెంగళూరు - హైదరాబాద్ రూట్లలో రూ. 849కు టికెట్లను అందుబాటులో ఉంచింది.

ఇదే సమయంలో బెంగళూరు - చెన్నై మధ్య రూ. 1,199కి, ముంబై - గోవా మధ్య రూ. 1,499కి, ముంబై - బెంగళూరు మధ్య రూ. 1,599కి, శ్రీనగర్ - ఢిల్లీ మధ్య రూ. 1,999కి టికెట్లను ఉంచింది. ఇతర రూట్లలో గోవా - ఢిల్లీ మధ్య ప్రయాణానికి రూ. 2,999కి, గోవా - చెన్నై మధ్య ప్రయాణానికి రూ. 2,199కి టికెట్లను విక్రయానికి ఉంచింది. ఈ ధరలు ఒకవైపు ప్రయాణానికి, ఎకానమీ క్లాస్ సీట్లకు వర్తిస్తాయని, మరే ఇతర ప్రమోషన్స్, గ్రూప్ బుకింగ్స్, రాయితీలకు న్యూ ఇయర్ సేల్ ఆఫర్లు వర్తించవని వెల్లడించింది. కాగా, జెట్ ఎయిర్ వేస్ రూ. 990 నుంచి, గో ఎయిర్ రూ. 999 నుంచి, ఎయిర్ ఆసియా రూ. 917 నుంచి విమానం టికెట్లను ఆఫర్ చేసిన సంగతి తెలిసిందే.

More Telugu News