: 117 ఏళ్ల రికార్డును బ‌ద్ద‌లుగొట్టిన గుజ‌రాత్ క్రికెట‌ర్‌.. 359 ప‌రుగుల‌తో నాటౌట్‌గా నిలిచిన స‌మిత్‌

గుజ‌రాత్ రంజీ క్రికెట‌ర్ స‌మిత్ గోహెల్ బాదుడుకు 117 ఏళ్ల‌పాటు భ‌ద్రంగా ఉన్న ప్ర‌పంచ రికార్డు బ‌ద్ద‌లైంది. రంజీ ట్రోఫీ క్వార్ట‌ర్ ఫైనల్స్‌లో భాగంగా ఒడిశాతో జ‌రుగుతున్న మ్యాచ్‌లో ఒపెన‌ర్‌గా బ‌రిలోకి దిగిన స‌మిత్ 359 ప‌రుగుల‌తో నాటౌట్‌గా నిలిచి గ‌త రికార్డులను బ‌ద్ద‌లుగొట్టాడు. స‌మిత్ దెబ్బ‌కు గుజ‌రాత్ 706 ప‌రుగుల భారీ స్కోరు చేసింది. ఫ‌స్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఓపెన‌ర్ చేసిన అత్య‌ధిక ప‌రుగులు ఇవే.

స‌మిత్ కంటే ముందు 1899లో స‌ర్రే జ‌ట్టు త‌ర‌పున బ‌రిలోకి దిగిన ఇంగ్లండ్ క్రికెట‌ర్ బాబీ అబెల్ 357  ప‌రుగులు చేశాడు. 117 ఏళ్ల‌పాటు భ‌ద్రంగా ఉన్న ఈ రికార్డును స‌మిత్ చెరిపేశాడు. అత్య‌ధిక  ప‌రుగులు చేసిన ఏడో ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌గానూ రికార్డు పుస్త‌కాల్లోకి ఎక్కిన స‌మిత్ ఫ‌స్ట్‌క్లాస్ క్రికెట్‌లో మ‌రో ఘ‌న‌త కూడా సాధించాడు. ఓపెన‌ర్‌గా బ‌రిలోకి దిగిన ఓ ఫస్ట్‌క్లాస్ క్రికెట‌ర్ ట్రిపుల్ సెంచ‌రీ చేసి నాటౌట్‌గా నిల‌వ‌డం 81 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ఇదే కావడం కూడా విశేషమే!  ఫ‌స్ట్‌క్లాస్ క్రికెట్‌లో అత్య‌ధిక ప‌రుగుల‌తో రికార్డులు  సృష్టించిన వారంతా త‌ర్వాతి కాలంలో ప్ర‌పంచ క్రికెట్‌లో త‌మ‌కంటూ ప్ర‌త్యేక స్థానం  సంపాదించుకున్న క్రికెట‌ర్లుగా మారారు. అటువంటి వారిలో డాన్ బ్రాడ్‌మ‌న్‌, లారా వంటి వారు కూడా ఉన్నారు.

More Telugu News