devineni: నువ్వెంత విషం చిమ్మినా... చ‌రిత్ర‌హీనుడివే అవుతావ్‌: జ‌గ‌న్‌పై దేవినేని నిప్పులు

ఆంధ్రప్ర‌దేశ్‌లో ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నులు వేగంగా జ‌రుపుతామ‌ని రాష్ట్ర భారీ నీటి పారుద‌ల శాఖ మంత్రి దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర రావు అన్నారు. ఈ రోజు నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ... పోల‌వ‌రం నిర్వాసితుల‌కి భూమికి భూమి ఇస్తామ‌ని చెప్పారు. పోల‌వ‌రం పూర్తయితే వైసీపీకి పుట్ట‌గ‌తులు ఉండ‌వని చెప్పారు. పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణం కోసం మొద‌టి ద‌శ‌లో కేంద్ర ప్ర‌భుత్వం నుంచి రూ.1981 కోట్లు చెక్కు అందింద‌ని చెప్పారు. పోల‌వ‌రం ప్రాజెక్టు 2018 చివ‌రిలోపు పూర్తి చేయాల‌నే మ‌హాసంక‌ల్పంతో తాముంటే సాక్షిప‌త్రిక‌లో పోల‌వ‌రం ప్రాజెక్టుపై ఇష్టం వ‌చ్చిన‌ట్లు రాస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు.

వైసీపీ అధినేత‌ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ఎంత విషం చిమ్మినా చ‌రిత్ర హీనుడు గానే మిగిలిపోతార‌ని దేవినేని అన్నారు. పోల‌వ‌రంను అడ్డుకోవ‌డానికి జ‌గ‌న్ ఎన్నో ప్ర‌య‌త్నాలు జ‌రుపుతున్నార‌ని ఆయ‌న అన్నారు. గ‌తంలో ప‌ట్టిసీమ‌పై కూడా వైసీపీ ఎన్నో కుట్ర‌లు చేసింద‌ని అన్నారు. ప‌క్క రాష్ట్రాల వారిని కూడా రెచ్చ‌గొట్టేలా వైసీపీ ప్ర‌వ‌ర్తించింద‌ని అన్నారు. జ‌గ‌న్ ఏది మాట్లాడుతున్నా ప్ర‌జ‌లు న‌మ్ముతార‌నే భ్ర‌మలో అస‌త్య, విష ప్ర‌చారాలు చేస్తున్నార‌ని ఆయ‌న అన్నారు. ఎన్ని త‌ప్పుడు వార్తలు రాసినా పోల‌వ‌రం ప్రాజెక్టుని పూర్తి చేస్తామ‌ని మంత్రి చెప్పారు.

More Telugu News