: ఇప్పటికీ నేనే సీఎస్... తీసేసే అధికారం ఎవరిది? ఆర్డర్ ఎక్కడుంది?: టీఎన్ మాజీ సీఎస్

తమిళనాడు రాష్ట్రానికి ఇప్పటికీ తానే చీఫ్ సెక్రటరీనని ఐటి దాడుల అనంతరం ఉద్వాసనకు గురైన రామ్మోహన్ రావు వ్యాఖ్యానించారు. తనను తీసేసే అధికారం ఎవరికి ఉందని ప్రశ్నించిన ఆయన, సీఎస్ గా తనను తొలగించింది ఎవరు? ఆర్డర్ కాపీ ఎక్కడుంది? దానిపై నేను సంతకం పెట్టానా? అంటూ ప్రశ్నల వర్షం గుప్పించారు. 1984లో తను కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి నిజాయతీగా బతికానని, తన నిజాయతీని చూసే జయలలిత తనకు ఈ అవకాశం ఇచ్చారని గుర్తు చేసుకున్నారు.

ఆమె మరణించి నెల రోజులైనా గడవక ముందే కుట్ర చేసి తనను ఇరికించే ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. ఐదున్నరేళ్ల పాటు తాను జయలలిత ప్రభుత్వంలో వివిధ శాఖల్లో పనిచేశానని, ఆ సమయంలో ఆమె తనకెన్నో సలహాలు, సూచనలు ఇచ్చి పాలనా నిర్ణయాలు తీసుకోవడం, ప్రజా పథకాలను అమలు చేయడంలో రాటు దేలానని చెప్పారు. 32 ఏళ్ల పాటు దేశానికి ఐఏఎస్ అధికారిగా సేవలందించానని, తనను ఇప్పుడు అవమానిస్తున్నారని ఆరోపించారు. తనను బదిలీ చేయాలనుకుంటే, సీఎంకు రెండు నిమిషాల పనని, బదిలీ చేసిన తరువాత తన ఇంట్లో సోదాలు జరిపి వుంటే రాష్ట్రం పరువు నిలిచేదని అన్నారు.

More Telugu News