: ఏపీ డ్రైవర్లకు ఏసీ రూములిస్తే, తెలంగాణ డ్రైవర్లకు తాగడానికి నీళ్లు కూడా ఇవ్వడం లేదు: టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్

ఆంధ్ర రాష్ట్రానికి చెందిన బస్సు డ్రైవర్లు హైదరాబాద్ కు వస్తే, వారు సేదదీరేందుకు ఎంజీబీఎస్ లో ఏసీ రూముల సౌకర్యాన్ని ఇస్తున్నామని, మరి తెలంగాణ బస్సులు విజయవాడకు వెళితే, డ్రైవర్లకు కనీసం మంచి నీరు కూడా ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని టీఆర్ఎస్ నేత శ్రీనివాసగౌడ్ ఆరోపించారు. ఈ ఉదయం ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాల సంఘ సభ్యులతో కలసి ఖైరతాబాద్ లోని ఆర్టీయే ఆఫీసుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు.

ఎన్నో ఏళ్లు కొట్లాడి, ఎందరో ప్రాణాలు కోల్పోయిన తరువాత తాము తెలంగాణను సాధించుకున్నామని, ఇప్పటికీ ఆంధ్రావారి ఆగడాలతో ఇబ్బందులు పడుతున్నామని ఆయన ఆరోపించారు. ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్ ఉన్నప్పటికీ, ఏపీ దాన్ని పాటించడం లేదని ఆరోపించారు. సింగిల్ పర్మిట్ విధానాన్ని అమలు చేయడం లేదని అన్నారు. మీడియా మాధ్యమంగా తనను, జేసీ ప్రభాకర్ రెడ్డిని కూర్చోబెడితే, మొత్తం అన్ని వివరాలనూ చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రభాకర్ రెడ్డిని తీసుకువెళ్లిన పోలీస్ స్టేషన్ కు తాను వెళితే, దాడి చేసేందుకు వచ్చారని కొత్త ఆరోపణలు చేస్తారని శ్రీనివాసగౌడ్ అన్నారు.

More Telugu News