: జేసీ సవాలును స్వీకరించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్... ఖైరతాబాద్ లో తీవ్ర ఉద్రిక్తత

తాము నిబంధనలకు అనుగుణంగానే ప్రైవేటు బస్సులను నడుపుతున్నప్పటికీ, తెలంగాణ ప్రభుత్వం వేధిస్తోందని, అందుకు తగిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని, దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ చేసిన దివాకర్ ట్రావెల్స్ సహ యజమాని జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ ఉదయం హైదరాబాద్, ఖైరతాబాద్ లోని ఆర్టీయే కార్యాలయానికి రావడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్ ను స్వీకరిస్తున్నామని చెబుతూ, తెలంగాణ ప్రైవేటు ట్రావెల్స్ అసోసియేషన్ ప్రతినిధులను వెంటబెట్టుకుని అప్పటికే టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్ ఆర్టీయే కార్యాలయం లోపలికి వెళ్లి వుండటంతో, ప్రభాకర్ రెడ్డిని పోలీసులు బయటే అడ్డుకున్నారు. కొంత వాగ్వాదం అనంతరం ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నామని ప్రకటించి, పోలీసు స్టేషన్ కు తరలించారు. తాము నిబంధనలకు విరుద్ధంగా బస్సులను తిప్పలేదని, తమను వేధిస్తున్నారన్న ఆధారాలు ఉండబట్టే సవాల్ చేశానని, అందుకు ఆధారాలు తీసుకునే వచ్చానని పోలీసు స్టేషన్ దగ్గర ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు.

More Telugu News