: ఉదయం విజయవాడ, మధ్యాహ్నం ఢిల్లీ, సాయంత్రం తిరుపతి... నేడు చంద్రబాబు ఫుల్ బిజీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేడు ఫుల్ బిజీ. ఈ ఉదయం విజయవాడలో ఉన్న ఆయన పలు సమీక్ష సమావేశాల అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడి నుంచి మధ్యాహ్నం తరువాత బయలుదేరి నేరుగా తిరుపతికి వెళ్లి తన వియ్యంకుడు, హీరో బాలకృష్ణ 100వ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి' ఆడియో విడుదల వేడుకలో పాల్గొంటారు.

 ఢిల్లీలో మధ్యాహ్నం ఒంటి గంటకు ఏపీ భవన్ లో అధికారులతో సీఎం సమావేశం కానున్నారు. ఆపై ఇండియా హాబికేట్ సెంటర్ లో నాబార్డు, నీటి పారుదల మంత్రిత్వ శాఖల సంయుక్త సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశంలోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నిమిత్తం తొలి దశ నిధులకు సంబంధించిన చెక్కును ఆయన అందుకోనున్నారు. ప్రాజెక్టు నిర్మాణం నిమిత్తం కేంద్రం భరించే మొత్తంలో నాబార్డు నుంచి తొలి దశ కింద రూ. 1,981 కోట్ల చెక్కును ఆయన స్వీకరిస్తారు. ఆపై 4 గంటలకు తిరుపతికి బయలుదేరి వెళ్తారు. రాత్రి 7 గంటలకు చంద్రబాబు తిరుపతి మునిసిపల్ హైస్కూల్ ప్రాంగణానికి చేరుకుంటారని తెలుస్తోంది. రాత్రికి తిరుపతిలోనే చంద్రబాబు బస చేయనున్నారు.

More Telugu News