: తన భోజనాన్ని తానే తెచ్చుకున్న ప్రధాని.. వారణాసిలో ఆసక్తికర సంఘటన!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన భోజనాన్ని తానే స్వయంగా తెచ్చుకున్నారు. తన లోక్ సభ నియోజకవర్గం అయిన వారణాసిలో బూత్ స్థాయి కార్యకర్తలతో కలిసి కూర్చుని ఆయన చక్కగా భోజనం చేశారు. ఈ ఆసక్తికర సంఘటన నిన్న చోటుచేసుకుంది. వారణాసిలో జరిగిన సమావేశానికి పదిహేడు వందల బూత్ లకు సంబంధించిన 26 వేల మంది కార్యకర్తలు హాజరయ్యారు. అయితే, ఈ కార్యక్రమానికి హాజరయ్యే ప్రతిఒక్కరూ తమ టిఫిన్, భోజనం తామే స్వయంగా తెచ్చుకోవాలని ముందుగానే సూచించారు. ఈ సూచన కార్యకర్తలకు మాత్రమే కాదు, తనకు కూడా వర్తిస్తుందనే విషయాన్ని మోదీ ప్రాక్టికల్ గా చేసి చూపించారు. ఈ విషయాన్ని బీజేపీ తన ట్విట్టర్ ఖాతాలో చెబుతూ, కొన్ని ఫొటోలను కూడా పోస్ట్ చేసింది. ప్రధాని మోదీ సహా ప్రతిఒక్కరూ తమ టిఫిన్ ని తామే తెచ్చుకున్నారని, భోజనం చేస్తూ పార్టీ కార్యకర్తలతో మోదీ మాట్లాడారని, ఇటువంటి సమానత్వం కేవలం బీజేపీలోనే సాధ్యమని ఆ ట్వీట్ లో బీజేపీ పేర్కొంది.

More Telugu News