: మరో వారం తరువాత కూడా ఇంతే.. రూ. 24 వేలు విత్ డ్రా చేసుకోవడం కూడా కష్టమే!

డిసెంబర్ 30... నోట్ల రద్దు తరువాత కేంద్రం పెట్టిన అన్ని ఆంక్షలూ తొలగిపోయే రోజు. ఆ తరువాత ఎవరు ఎంత మొత్తం డబ్బు కావాలన్నా తీసుకోవచ్చు. ఇది కేవలం కాగితాలకు మాత్రమే పరిమితమని, వాస్తవ పరిస్థితిలో అసాధ్యమని అంటున్నారు బ్యాంకర్లు. కోరుకున్న మొత్తం కాదుగదా, ప్రభుత్వం విధించిన పరిమితి రూ. 24 వేలు (ఇది 29 వరకే అమలు) కూడా చేతికి అందబోదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. బ్యాంకుల వద్ద డబ్బులు చాలినంత లేవని, కొత్తనోట్లు సరఫరా కావడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

 కొత్త సంవత్సరంలో అధిక మొత్తంలో విత్ డ్రాలకు సమస్యలు తప్పబోవని నిపుణుల అభిప్రాయం. ఒకవేళ రూ. 2 వేల నోట్లను మరింతగా ముద్రించి బ్యాంకులకు అందించినా, వాటిని మార్చుకోవడం కష్టంతో కూడుకొని ఉండటంతో, వాటిని స్వీకరించేందుకు కస్టమర్లు ఇప్పటికప్పుడు అంగీకరించే పరిస్థితి లేదని భావిస్తున్నారు. కాగా, నవంబర్ 10 నుంచి ఇప్పటివరకూ బ్యాంకులు దాదాపు రూ. 6 లక్షల కోట్ల కొత్త నోట్లను ప్రజలకు ఇచ్చాయి. వీటిల్లో రూ. 2 వేల నోట్లే అత్యధికం. ఈ నేపథ్యంలో మరో వారం తరువాత కూడా ప్రజలకు నగదు కష్టాలు తప్పవు.

More Telugu News