: ప్రముఖ సినీ డైరెక్టర్ సిద్ధార్థ శ్రీనివాసన్ పై గృహహింస కేసు.. భార్యను ఇంట్లోకి అనుమతించాలని కోర్టు ఆదేశం!

ప్రముఖ సినీ దర్శకుడు, సాండ్స్‌ ఆఫ్‌ సోల్స్‌ (పైరన్‌ తల్లె) ఫేమ్  సిద్ధార్థ శ్రీనివాసన్ గృహహింస కేసును ఎదుర్కొంటున్నాడు. వివరాల్లోకి వెళ్తే, శ్రీనివాసన్ విషయంలో అతని భార్య దివ్యా భరద్వాజన్ ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది. 2013లో తాను అనారోగ్యంతో ఉన్నప్పుడు తన భర్త శ్రీనివాసన్, అతని తల్లి తనను వదిలేసి వెళ్లిపోయారని... ఆ పరిస్థితుల్లో గత్యంతరం లేక తాను తన పుట్టింటికి వెళ్లానని దివ్య తన పిటిషన్ లో తెలిపింది. ఇప్పుడు తాను తిరిగి రాగా... తన భర్త మకాం మార్చడమే కాక, కొత్తింట్లోకి తనను రానీయకుండా అడ్డుకుంటున్నారని చెప్పింది. విడాకులు ఇవ్వాలంటూ భర్త, అత్తమామలు తనను వేధిస్తున్నారని తెలిపింది. తాను ఇంట్లోకి ప్రవేశించేందుకు అనుమతించాలని... తనకు భరణం ఇచ్చేలా ఆదేశించాలని పిటిషన్ లో కోరారు.

ఈ నేపథ్యంలో కోర్టు స్పందిస్తూ, దివ్య గృహహింసను ఎదుర్కొంటున్నట్టు ప్రాథమిక ఆధారాలను బట్టి తెలుస్తోందని వ్యాఖ్యానించింది. సొంతిల్లు లేని ఆమెను ఇంట్లోకి పిలుచుకోవాలని, అటాచ్డ్ బాత్ రూమ్ ఉన్న గదిని ఆమెకు కేటాయించాలని ఆదేశించింది. అయితే, దివ్యను ఇంటి నుంచి గెంటివేయలేదని శ్రీనివాసన్ తరపు లాయర్ వాదించాడు. ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటే వివాదం మరింత పెరుగుతుందని కోర్టుకు తెలిపాడు. అయితే, లాయర్ వాదనను కోర్టు కొట్టివేసింది. 

More Telugu News