: స్పీకర్ ఛైర్ లో కూర్చుని సభను వాయిదా వేసిన బీజేపీ ఎమ్మెల్యే సస్పెన్షన్

హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీలో సభామర్యాదలు పాటించకుండా వ్యవహరించిన ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు. స్పీకర్ బుటాలీ సభను ప్రారంభించగానే అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. దీంతో 15 నిమిషాల పాటు సభను వాయిదా వేశారు. అనంతరం మళ్లీ సభ ప్రారంభించేందుకు ఆయన తన స్థానంలోకి వచ్చేసరికి బీజేపీ ఎమ్మెల్యే, స్పీకర్‌ ప్యానల్‌ మెంబర్‌ సురేశ్‌ భరద్వాజ్‌ స్పీకర్‌ స్థానంలో కూర్చొని సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

 ఆయన ఆ విషయాన్ని చెప్పగానే ఇద్దరు ఎమ్మెల్యేలు లేచి సభ నుంచి బయటికి వెళ్లిపోయారు. దీంతో, సభా మర్యాదలు పాటించనందున వారిని సస్పెండ్‌ చేయాలని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ముఖేశ్‌ అగ్నిహోత్రి తీర్మానం ప్రవేశపెట్టారు. దీంతో స్పీకర్ బుటాలీ బీజేపీకి చెందిన సురేశ్‌ భరద్వాజ్‌, రాజీవ్‌ బిందాల్‌, రవీంద్రశర్మ లను సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సస్పెన్షన్ శీతాకాల సమావేశాలు ముగిసేవరకు కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 23తో హిమాచల్ ప్రదేశ్ శాసనసభ సమావేశాలు ముగియనున్నాయి. 

More Telugu News