: గాలిలో 45 నిమిషాల పాటు ఊగిసలాడిన ముఖ్యమంత్రి హెలికాప్టర్

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ గాలిలో ఊగిసలాడటం తీవ్ర ఉత్కంఠను రేపింది. కోరాపుట్ జిల్లాలోని కోట్ పాద్ వద్ద హెలికాప్టర్ ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే, కొంత సమన్వయ లోపం ఏర్పడటంతో అనుకున్న సమయానికి కోట్ పాద్ వద్దకు హెలికాప్టర్ రాలేకపోయింది. దీంతో, ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అదృశ్యమైపోయిందంటూ ఒక్కసారిగా వదంతులు వ్యాపించాయి. కోట్ పాద్ మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో... అందర్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దాదాపు 45 నిమిషాల పాటు గాలిలో ఊగిసలాడిన అనంతరం... చివరకు కోట్ పాద్ వద్ద చాపర్ ల్యాండ్ అయింది. మధ్యాహ్నం 12.40కి రావాల్సిన హెలికాప్టర్.... 1.30కి వచ్చింది. దీంతో, అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పలు సంక్షేమ పథకాలను నేరుగా లబ్ధిదారులకు అందజేసేందుకు నవీన్ పట్నాయక్ కోరాపుట్ జిల్లాకు వచ్చారు.   

More Telugu News