: హరీశ్‌‌రావుకు జానారెడ్డి క్లాస్.. సంప్రదాయాన్ని మార్చొద్దని హితవు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్న వేళ బుధవారం సీఎల్పీ నేత జానారెడ్డి మంత్రి హరీశ్‌రావుకు అసెంబ్లీలో క్లాస్ తీసుకున్నారు. సంప్రదాయానికి విరుద్ధంగా వెళ్లవద్దని సూచించారు. వ్యవసాయంపై జరిగిన చర్చ సందర్భంగా కాంగ్రెస్ శాసనసభ్యుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాట్లాడుతుండగా మధ్యలో లేచిన మంత్రి హరీశ్‌రావు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తూ కోమటిరెడ్డి, సంపత్‌ పేర్లను ప్రస్తావించారు. హరీశ్‌రావు వివరణ అనంతరం ఉత్తమ్ కుమార్‌రెడ్డి తన ప్రసంగాన్ని పూర్తి  చేశారు. అనంతరం ఎంఐఎం సభ్యుడు మొజాంఖాన్‌కు స్పీకర్ మైక్ ఇచ్చారు.

అయితే మంత్రి తమ పేర్లను ప్రస్తావించారు కాబట్టి తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోమటిరెడ్డి, సంపత్‌లు కోరారు. అందుకు స్పీకర్ నిరాకరించారు. దీంతో సభలో కొంతసేపు గందరగోళం నెలకొంది. దీంతో కల్పించుకున్న జానారెడ్డి లేచి మాట్లాడారు. సభలో ప్రతిపక్ష సభ్యులు మాట్లాడిన అంశాలను నోట్ చేసుకుని, వారు లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం ఏం చేస్తుందో వివరణ ఇవ్వాలని, ఇది గతం నుంచి వస్తున్న సంప్రదాయమంటూ హరీశ్‌కు క్లాస్ తీసుకున్నారు. కాంగ్రెస్‌ను ఉద్దేశించి మంత్రి మాట్లాడిన మాటలకు తనకూ కౌంటర్ ఇవ్వాలని ఉందని, 'అయితే ఆయనా లేచి, నేనూ లేస్తే ఇక కౌంటర్లకే సమయం  సరిపోతుందని' అన్నారు. అంతా అయిన తర్వాతే మంత్రులు మాట్లాడాలని, గత సంప్రదాయాన్ని గౌరవించాలని హరీశ్‌కు సూచించారు.

More Telugu News