jadeja: ఇదే దూకుడు కొనసాగిస్తాం.. విదేశాల్లో అదరగొడతాం!: రవీంద్ర జడేజా

తాజాగా ఐసీసీ ప్ర‌క‌టించిన‌ టెస్టు ర్యాంకుల్లో రెండో స్థానంలో నిలిచిన టీమిండియా బౌలర్ ర‌వీంద్ర జ‌డేజా ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ... భ‌విష్య‌త్తులోనూ టీమిండియా ఇదే దూకుడును కొన‌సాగిస్తూ విజ‌యాలు న‌మోదు చేస్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశాడు. రానున్న కొత్త ఏడాది విదేశాల్లోనూ మంచి విజయాలు సాధిస్తామ‌ని చెప్పాడు. ఈ విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు తనతో పాటు భార‌త్ క్రికెట్‌ జట్టు హామీ ఇస్తుంద‌ని వ్యాఖ్యానించాడు. విదేశాల్లో టీమిండియా రాణించ‌లేద‌ని ఉన్న భావ‌న‌ను తొల‌గించేలా అక్క‌డ కూడా విజ‌యాలు అందుకుని రికార్డులను సరిచేస్తామ‌ని అన్నాడు.

టీమిండియా ఆటగాళ్లందరూ జిమ్‌లో గంటల కొద్దీ కష్టపడుతున్నారనీ, ఎంతో ఫిట్ గా ఉన్నార‌ని జడేజా అన్నాడు. ఈ కార‌ణం వ‌ల్లే తాము మెరుగైన ఆట‌తీరు క‌న‌బ‌రుస్తున్నామ‌ని తెలిపాడు. మున్ముందు కూడా తాను రాణించి బ్రాండ్స్‌ తనను సంప్రదించేలా చేసుకుంటాన‌ని పేర్కొన్నాడు. ఈ ఏడాది టీమిండియా టెస్టుల్లో మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న‌ను క‌న‌బ‌రిచింది. మొత్తం 11 టెస్టులు ఆడిన టీమిండియా 8 టెస్టులలో విజయం సాధించింది. గతంలో 2010లో ఉన్న ఈ రికార్డును ఇప్పుడు టీమిండియా స‌మం చేసింది.

More Telugu News