: మీ తీరు చూస్తుంటే తెలంగాణ ఇచ్చి తప్పు చేశామా? అనిపిస్తోంది.. అసెంబ్లీలో జానారెడ్డి భావోద్వేగం

మీ తీరు చూస్తుంటే తెలంగాణ ఇచ్చి తప్పు చేశామేమో అని అనిపిస్తోంది... కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అసెంబ్లీలో వ్యక్తం చేసిన ఆవేదన ఇది. మంగళవారం శాసనసభలో ‘తెలంగాణ అంశం’ తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. ‘నా తెలంగాణ.. నా ఉద్యమం..’ అంటూ ప్రసంగిస్తున్న మంత్రి ఈటల రాజేందర్ తీరును తప్పుబట్టిన సీఎల్పీ నేత జానారెడ్డి మాట్లాడుతూ కాస్తంత ఉద్వేగంగా ప్రసంగించారు. ‘మన తెలంగాణ’ అని ఎందుకు అనరంటూ మంత్రిని ప్రశ్నించారు.

‘నా తెలంగాణ ఏమిటి? మన తెలంగాణ అనలేవా? తెలంగాణను నువ్వే తెచ్చావా ఏమిటి? అప్పుడు ఏడ పడుకున్నారు? ప్రతిదానికి ‘నా’ అనే  పదమే వాడతావా? 'మనం' అనండి. మీకు ప్రజలు ఓ అవకాశం ఇచ్చారంతే. తెలంగాణ కావాలంటూ చాలామంది డిమాండ్ చేశారు. అందులో మీరు ఒకరు, అంతే. కాంగ్రెస్ లేకపోతే మీకు అధికారం వచ్చి ఉండేదే కాదు. మీరొక్కరే అన్న భావన వద్దు. మా సభ్యులకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వండి’’ అంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. జానారెడ్డి ప్రసంగానికి స్పందించిన మరోమంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ‘నా తెలంగాణ’ అని ఏనాడూ అనుకోలేదని, విధిలేని పరిస్థితుల్లోనే తెలంగాణను ఇచ్చారని పేర్కొన్నారు. అందుకే కాంగ్రెస్ విపక్షంలో, టీఆర్ఎస్ అధికార పక్షంలో ఉందని కౌంటర్ ఇచ్చారు.

More Telugu News