: ‘నా తెలంగాణ’ అనకూడదు.. ‘మన తెలంగాణ’ అనాలి: అసెంబ్లీలో జానారెడ్డి ఫైర్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఈ రోజు మంత్రి కేటీఆర్‌, కాంగ్రెస్ స‌భ్యుడు జానారెడ్డి మ‌ధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ రోజు శాస‌న‌స‌భ‌లో మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ ఓ సారి ‘నా తెలంగాణ’ అని వ్యాఖ్యానించారు. అయితే, ఆయ‌న అలా అనడం ప‌ట్ల జానారెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈట‌ల రాజేంద‌ర్ ‘నా తెలంగాణ’ అంటూ వ్యాఖ్యానించార‌ని అలా అన‌కూడ‌ద‌ని ‘మన తెలంగాణ’ అనాల‌ని ఆయ‌న అన్నారు. జానారెడ్డి వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ‘నా తెలంగాణ’ అని భావించలేదని ఆయన వ్యాఖ్యానించారు. ప్ర‌త్యేక తెలంగాణ‌ను కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదని, రాష్ట్రం పోరాడితేనే వ‌చ్చిందని అన్నారు.

కేటీఆర్ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన జానారెడ్డి తెలంగాణ ఏర్ప‌డ‌క‌ముందు ఆంధ్రా నేతలు మూకుమ్మడి రాజీనామాలు చేస్తాన‌న‌డంతో అప్ప‌ట్లో కేటీఆర్ తన ఇంటికి వచ్చారని, ప్ర‌త్యేక‌ తెలంగాణ సాధనకు ఏం చేద్దామని త‌న‌ను అడిగారని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి తామే న‌చ్చ‌జెప్పామ‌ని అన్నారు. తాము ఆ తెలంగాణ ఇచ్చే స‌మ‌యంలో కేంద్రంతో పాటు రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్నామ‌ని, తామే గ‌నుక ఉద్య‌మాన్ని అణ‌చివేయాల‌ని అనుకుంటే ఆ ప‌ని చేసేవారమ‌ని అన్నారు. దీంతో మ‌రింత ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన కేటీఆర్‌... జానారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉప‌సంహ‌రించుకోవాల‌ని అన్నారు.

More Telugu News