: కీలక నిర్ణయం... అక్రమార్కుల వద్ద దొరికిన కొత్త కరెన్సీ బ్యాంకుల ద్వారా ప్రజలకు!

పెద్ద నోట్ల రద్దు తరువాత, కొత్త కరెన్సీ వ్యవస్థలోకి రాగా, అక్రమార్కులు వాటిని కూడా బ్యాంకులు, ఆర్బీఐ అధికారుల సహకారంతో నొక్కేస్తుండగా, వివిధ ప్రాంతాల్లో దాడులు జరిపి స్వాధీనం చేసుకున్న కోట్ల కొద్దీ కరెన్సీని ఆదాయపు పన్ను శాఖ, సీబీఐ, ఈడీ అధికారులు తిరిగి వ్యవస్థలోకి పంపాలని నిర్ణయించారు. ఈ డబ్బును వివిధ ప్రాంతాల్లోని బ్యాంకుల్లో కొత్త ఖాతాలను తెరిచి డిపాజిట్ చేయాలని నిర్ణయించినట్టు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కమల్ సింగ్ స్పష్టం చేశారు. బ్యాంకుల్లో డిపాజిట్ అయిన సొమ్ము తిరిగి ప్రజలకు చేరుతుందని ఆయన వివరించారు.

డబ్బుతో పాటు స్వాధీనం చేసుకున్న ఇతర వస్తువులను స్ట్రాంగ్ రూములో భద్రపరచనున్నట్టు వెల్లడించారు. ఈడీ మాదిరిగానే, ఆదాయపు పన్ను శాఖ సైతం తమ అధీనంలోని డబ్బును బ్యాంకు ఖాతాల్లో వేయాలని మోదీ ప్రభుత్వం సూచించింది. వాస్తవానికి ఇలా పట్టుకున్న డబ్బును కేసులు పరిష్కారం అయ్యే వరకూ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో డిపాజిట్ చేసి, లాకర్లలో ఉంచేవారు. ఏళ్ల కొద్దీ ఈ ధనం నిరుపయోగంగా ఉండేది. ఇప్పుడిక ఇది బ్యాంకులకు ఇస్తే, వ్యవస్థలో కాస్తంతైనా నోట్ల కొరత తీరుతుందని అధికారులు వ్యాఖ్యానించారు.

More Telugu News